మద్యం సేవించి వాహనాలు నడుపుతూ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో భాగంగా.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి.. ఏకంగా 431 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఈ కఠిన చర్యలు మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి తీవ్ర హెచ్చరికగా మారాయి. పట్టుబడిన వీరిలో 325 మంది ద్విచక్ర వాహనదారులు, 86 మంది కారు డ్రైవర్లు, 16 మంది ఆటో డ్రైవర్లు, 4 గురు భారీ వాహనదారులు ఉన్నారు. వాహనదారులు సేవించిన బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ ఆధారంగా పోలీసులు కేసులను వర్గీకరించారు.
తక్కువ స్థాయి 378 మందికి.. మధ్యస్థ స్థాయి 42 మందికి, అత్యధిక స్థాయి 11 మందికి.. వీరందరినీ చట్టపరంగా కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు సంబంధిత పోలీసు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు మరోసారి పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై.. ఎవరైనా మరణిస్తే, భారతీయ న్యాయ సంహిత – 2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నేరానికి గరిష్ట శిక్షగా 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.
ట్రాఫిక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గత వారం రోజుల్లో (24.11.2025–29.11.2025) మొత్తం 320 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి.వీరిలో 264 మందికి కేవలం జరిమానా విధించగా.. 35 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు. 21 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించారు.
ఇదిలా ఉండగా.. కరీంనగర్ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. రెండోసారి ఈ నేరానికి పాల్పడిన ఆ వ్యక్తిని కోర్టు ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ కఠిన శిక్షలు పదేపదే నేరాలకు పాల్పడేవారికి ఒక హెచ్చరికగా పనిచేస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa