ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయకుండా, ముఖ్యంగా బీసీల రిజర్వేషన్ల విషయంలో తీవ్రంగా మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయంగా దారి తప్పించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాలో అభివృద్ధి పేరుతో ఏ ఒక్క పనీ జరగలేదని తాతా మధు విమర్శించారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటన చేయడం వెనుక ప్రజలపై ఒత్తిడి పెంచి, రాజకీయ లబ్ధి పొందే కుట్రే ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ను ఉల్లంఘించే చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి ముఖ్యమంత్రి పర్యటనను ఆపివేయాలని తాతా మధుసూదన్ డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున రోడ్డెక్కి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ప్రజలు ఈ రాజకీయ నాటకాలకు లొంగకూడదని, కాంగ్రెస్ హామీల మోసాన్ని గుర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతల ఈ ఆవేదన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపనుంది. పంచాయతీ ఎన్నికల్లో ఈ అంశం ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa