ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం రాయితీ.. వార్త పూర్తిగా అవాస్తవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 03, 2025, 07:19 PM

గత కొన్ని రోజుల నుంచి ట్రాఫిక్ చలాన్లపై భారీగా రాయితీలు ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం అని.. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు.


హైదరాబాద్ సిటీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్  ఖాతా ద్వారా ఈ తప్పుడు సమాచారాన్ని ఖండించారు. డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి ఎలాంటి లోక్ అదాలత్‌ను నిర్వహించడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ తేదీకి సంబంధించి లోక్ అదాలత్ తరఫు నుంచి కూడా అధికారిక నోటిఫికేషన్ జారీ కాలేదు. ప్రస్తుతం ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి తగ్గింపులు లేదా రాయితీలు లేవని తేల్చి చెప్పారు. చలాన్లపై 50 శాతం నుంచి 100 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారనే వార్త తప్పు అని పేర్కొన్నారు. ఈ రాయితీలకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి గానీ.. ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గానీ అధికారిక ప్రకటన గానీ, సమాచారం గానీ రాలేదని పేర్కొన్నారు.


ఇటువంటి అవిశ్వసనీయ సమాచారాన్ని నమ్మి మోసపోకుండా ఉండాలంటే.. ప్రజలు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఇటువంటి ముఖ్యమైన క్లెయిమ్‌లను నమ్మే ముందు, వాటిని ధృవీకరించుకోవడం చాలా ముఖ్యం. తప్పుడు సమాచారాన్ని నమ్మి చలాన్ల చెల్లింపు పేరుతో ఆన్‌లైన్ మోసాలకు గురికావద్దు. వీటిపై ఎల్లప్పుడూ అధికారిక పోలీసు వెబ్‌సైట్‌లను (ఉదాహరణకు.. హైదరాబాద్ సిటీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్) లేదా వారి అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను మాత్రమే తనిఖీ చేయడం మంచిది. గతంలో లోక్ అదాలత్‌లలో రాయితీలు ప్రకటించినప్పుడు.. దానికి సంబంధించిన ప్రక్రియను ముందస్తుగానే అధికారికంగా ప్రకటించారు.


ప్రస్తుతం దీనిపై అధికారిక ప్రకటన లేకుండా వస్తున్న వార్తలను వెంటనే తిరస్కరించడం ఉత్తమం. తప్పుడు సమాచారాన్ని ఫార్వార్డ్ చేయకుండా.. బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ట్రాఫిక్ చలాన్లపై రాయితీలు కల్పించడం కరెక్ట్ కాదని.. ఇలా రాయితీ ప్రకటిస్తే వాహనదారులకు ఎలాంటి భయం ఉండదని.. నిబంధనలు ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతాయని ఇటీవల హైకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలోని వాహనదారులకు పెండింగ్ చలాన్లపై ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. దీనిపై ఫేక్ వార్తలు నమ్మోద్దని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa