తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు వేగం పుంజుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. ఈ పథకం పురోగతిని, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను తిరిగి పునరుద్ధరించామని మంత్రి తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇప్పటివరకు దాదాపు 4 లక్షల ఇండ్లను మంజూరు చేశామని తెలిపారు. వీటిలో 3 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయన్నారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి.. వచ్చే ఏడాది మార్చి నాటికి 1 లక్ష, జూన్కు మరో 2 లక్షల గృహ ప్రవేశాలు జరిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఇప్పటికే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు.
జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో పేదల కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా.. వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే జీ+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేలా త్వరలో ఇందిరమ్మ అర్బన్ హౌసింగ్ పాలసీని ప్రకటించబోతున్నారు. ఓఆర్ఆర్ (ORR) చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించామని.. ఒక్కో చోట 8 వేల నుంచి 10 వేల ఇళ్లు నిర్మించే ప్రతిపాదన ఉందని మంత్రి తెలిపారు.
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న పాత ఇళ్లను తొలగించి.. వాటి స్థానంలో హైరైజ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 2BHK ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి రూ. 700 కోట్లు, మౌలిక వసతుల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి.. 394 మంది డీఈఈలను తిరిగి రప్పించి.. 800 మంది ఏఈలను కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకున్నారు.
వివిధ శాఖల నుంచి అధికారులను డిప్యూటేషన్పై తీసుకుని వ్యవస్థను పటిష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో చేతివాటం చూపిన 9 మంది పంచాయతీరాజ్ కార్యదర్శులను సస్పెండ్ చేశామని.. మరో ఇద్దరిని సర్వీసు నుంచి తొలగించామని మంత్రి స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు అమలు చేస్తామని హెచ్చరించారు. హౌసింగ్ బోర్డు భూములను కబ్జా చేసిన వారి నుంచి వెయ్యి ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి మధ్యలోనే వదిలేసిన సుమారు 15 వేల మందికి కొత్త పథకం వర్తించేలా కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa