తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. స్వయం సహాయక మహిళా సంఘాలకు భారీ ఆర్థిక చేయూతను అందించింది. నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన 'ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు' కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.11.33 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను మహిళా సంఘాలకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి.. ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే సరికొత్త మాడల్ను త్వరలో ప్రకటించబోతున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో జరగబోయే ' తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ' గురించి వివరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు వంద దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమ్మిట్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును.. అలాగే భవిష్యత్తులో తెలంగాణను అభివృద్ధి పథాన నడిపించే వ్యూహాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం వరి ఉత్పత్తి, శాంతిభద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నియంత్రణ, విద్య, వైద్య రంగాల్లో నంబర్ 1 గా ఉన్న తెలంగాణను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.
పేదవారి ఆకలిని తీర్చినప్పుడే సంక్షేమ పథకాలకు సార్థకత ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణలో నిరుపేదలకు అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ విషయంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సన్నబియ్యం ఇవ్వడం లేదని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని.. గిరిజన ప్రాంతాల్లో అదనంగా 25 వేల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. దేవరకొండకు నర్సింగ్ కాలేజీని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పదేళ్ల పాటు పడావు పడిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.
దేవరకొండ మున్సిపాలిటీలో రూ.13 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.50 కోట్లతో సీసీ డ్రైన్లు, రూ.2.5 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ ఎంపీ ఎస్. జైపాల్ రెడ్డి చదువుకున్న పాఠశాల అభివృద్ధికి రూ.6 కోట్ల నిధులు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి బాధ్యత, బీఎన్ఆర్ పార్క్ , ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ట్రాక్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని.. నెలాఖరులోపు సంబంధిత మంత్రులను జిల్లాకు పంపి సమీక్ష చేయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa