ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంబీబీఎస్ విద్యార్థిని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 13, 2025, 08:58 PM

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. రాజకీయాలపై యువత ఆసక్తి చూపుతూ ఎన్నికల బరిలోకి దిగుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థిని సర్పంచ్ పదవికి పోటీ చేయడం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది. వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని దొంగ ఎన్కేపల్లి గ్రామంలో ఈ నెల 17న జరగనున్న సర్పంచ్ ఎన్నికల బరిలో ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీయ రెడ్డి పోటీ పడుతున్నారు.


సమాజ సేవ సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రామంలోని యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తన ప్రధాన లక్ష్యమని శ్రీయ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు.. కార్పొరేట్ ఆసుపత్రులలో తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. తమ కుటుంబీకులు పదవులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నారని.. నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుంటామని ఆమె పేర్కొన్నారు.


రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు..


తెలంగాణలో ఆదివారం (రేపు) రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీని కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే.. 415 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మరో 5 చోట్ల నామినేషన్లు లేకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఏకగ్రీవాలు కాకుండా.. మిగిలిన 3,911 పంచాయతీలకు సర్పంచులు, 29,903 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు.


రెండో దశ పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున బయలుదేరారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌ లు ఏర్పడ్డాయి. ప్రజలు ఉత్సాహంగా తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. శ్రీయ రెడ్డి వంటి చదువుకున్న యువత.. కేవలం వృత్తిని మాత్రమే కాకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం స్థానిక పాలనలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా అభ్యర్థి విద్యార్హతలు, సేవా దృక్పథానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa