ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపుపై అభ్యంతరాలు.. హైకోర్టులో పిటిషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 07:40 PM

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్‌ నగర పరిపాలనలో కీలక సంస్కరణలు చేపట్టిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని వార్డుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 150 నుంచి ఏకంగా 300కు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు డిసెంబర్ 8న గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో డివిజన్ల సంఖ్య పెంపును సవాల్‌ చేస్తూ.. వినయ్‌కుమార్‌ అనే వ్యక్తి సోమవారం (డిసెంబర్ 15) తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డివిజన్ల పునర్విభజన సమయంలో ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం పట్టించుకోలేదని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ విషయాన్ని అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.


విభజన ఏకపక్షంగా జరిగింది..


డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ పేర్కొన్నారు. వార్డుల పునర్విభజన అసంబద్ధంగా, ఏకపక్షంగా జరిగిందని ఆరోపించారు. భౌగోళిక సౌలభ్యం, జనాభా, పరిపాలనా సమతుల్యతను పక్కనపెట్టి.. వార్డుల డీలిమిటేషన్ చేశారని పిటిషన్‌లో ఆరోపించారు. అయితే కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా.. మరికొన్ని ప్రాంతాలకు లాభం చేకూర్చేలా వార్డుల విభజన చేశారని ఆరోపణ గుప్పించారు. ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు.


మరోవైపు, రాంనగర్‌ డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. వినయ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బి విజయ్‌సేన్‌ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించడం గమనార్హం. ఈ పిటిషన్‌పై విచారణను డిసెంబర్ 16కు వాయిదా వేసింది హైకోర్టు.


ఇటీవల నగర శివారు 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన సర్కార్.. వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచింది. డివిజన్ల క్రమం హైదరాబాద్ ఈశాన్యంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ నుంచి మొదలవుతుంది. దమ్మాయిగూడ జనాభా లక్ష వరకు ఉన్నందున.. దాన్ని రెండు డివిజన్లుగా విభజించారు. గ్రేటర్‌లో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కనీసం రెండు డివిజన్లుగా మారనున్నాయి.


కాగా, వార్డుల సంఖ్య పెంపుతో సులభంగా పాలన జరగుతుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. విభజన ద్వారా వార్డు పరిధి చిన్నదవుతుంది. దీంతో కార్పొరేటర్లు తమ వార్డులోని సమస్యలను సులభంగా తెలుసుకుని పరిష్కరించే అవకాశం ఏర్పడుతుంది. కాగా, వార్డుల డీలిమిటేషన్ ద్వారా రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 300 మంది కార్పొరేటర్లు ఎన్నికవుతారు. ప్రతి కార్పొరేటర్ తమ వార్డు అభివృద్ధిపై పూర్తి దృష్టి సారించి.. నీరు, రోడ్లు, పారిశుద్ధ్యం వంటి ప్రాథమిక వసతుల విషయంలో మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa