ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూరియా కొనుగోళ్ల కోసం త్వరలోనే యాప్‌ను తీసుకురానున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 16, 2025, 04:40 PM

రాష్ట్రంలో యూరియా కొనుగోళ్ల కోసం త్వరలోనే ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకురానున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. యూరియా అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు, పరిశ్రమలకు తరలిపోకుండా నేరుగా రైతులకే అందేలా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మీడియాతో ఈరోజు నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు.పత్తి అమ్మకాల కోసం ప్రవేశపెట్టిన 'కపాస్ కిసాన్' యాప్ వంద శాతం విజయవంతమైందని, అదే స్ఫూర్తితో యూరియా యాప్‌ను రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ యాప్‌పై రైతు వేదికల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించామని, వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. స్లాట్ బుకింగ్ వంటి విషయాల్లో రైతులకు సహాయం అందించేందుకు రైతు వేదికల వద్ద ఏఈవోలు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు. కొందరు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అదే సమయంలో, పంటల సర్వే కోసం శాటిలైట్ టెక్నాలజీని వినియోగించేందుకు జర్మనీకి చెందిన ఒక సంస్థతో చర్చలు తుది దశలో ఉన్నాయని తుమ్మల తెలిపారు. ఈ ఒప్పందం ఖరారైతే, వాస్తవంగా పంట సాగు చేసిన భూమికే 'రైతు భరోసా' సహాయం అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. కొండలు, గుట్టల వంటి సాగు చేయని భూములకు భరోసా నిలిపివేసి, ఆ నిధులను ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు మళ్లిస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై త్వరలో కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa