తెలంగాణలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రికార్డు స్థాయిలో డబ్బుల పంపకాలు జరిగినట్లు సమాచారం.ఇంత స్థాయిలో డబ్బుల లావాదేవీలు బహుశా ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా చూడలేదని గ్రామస్తులే వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా హైదరాబాద్ శివారులోని శంకరపల్లి మండలంలోని గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు పరస్పరం పోటీ పడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు.రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని గ్రామపంచాయతీ ఎన్నికల్లో సుమారు రూ.6 వేల కోట్ల వరకు డబ్బులు చేతులు మారినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. శంకరపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలు మూడో దశలో భాగంగా ఈరోజు (సెప్టెంబర్ 17) నిర్వహించబడుతున్నాయి. సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులు భూములు అమ్ముకుని మరీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.శంకరపల్లిలో ఒక్కో ఓటుకు రూ.55 వేల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలుత ఒక పార్టీకి చెందిన అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.40 వేల చొప్పున పంపిణీ చేయగా, దీనికి ప్రతిస్పందనగా మరో పార్టీ అభ్యర్థి రూ.50 వేల వరకు ఇచ్చాడని సమాచారం. వీరిద్దరికీ తగ్గకుండా మూడో పార్టీ అభ్యర్థి ఒక్కో ఓటరుకు రూ.55 వేల వరకు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా మొత్తం కలిపి ఒక్కో ఓటరుకు రూ.లక్షా 50 వేల వరకు డబ్బులు అందినట్లు చెబుతున్నారు.ఇక పటాన్చెరు ప్రాంతంలో ఓ సర్పంచ్ అభ్యర్థి సుమారు రూ.17 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయల వరకు పంచినట్లు తెలుస్తోంది. డబ్బులతో పాటు మద్యం, చీరలు, గిఫ్టులు బోనస్గా ఇచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. మరికొన్ని గ్రామాల్లో ఉంగరం గుర్తు ఉన్న అభ్యర్థులు ఏకంగా వెండి ఉంగరాలు పంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అలాగే హైదరాబాద్ నుంచి ఓటు వేసేందుకు గ్రామాలకు వచ్చే ఓటర్లకు ప్రయాణ ఖర్చులు కూడా అభ్యర్థులే భరిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa