ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి రాష్ట్రానికి 100 నుంచి 150 నూతన అంబులెన్సులను ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 18, 2025, 02:55 PM

దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా పెరుగుతున్న మరణాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలు కలిగిన అంబులెన్స్‌లను రాష్ట్రాలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే, ప్రమాదం జరిగిన 10 నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకోవాలనే షరతుపైనే వాటిని అందజేస్తామని రాజ్యసభలో ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా దేశంలో రోడ్డు ప్రమాదాల తీవ్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటిలో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. మృతుల్లో 66 శాతం మంది 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయసు వారే ఉండటం అత్యంత బాధాకరమని ఆయన తెలిపారు.అలాగే, ప్రమాదాల్లో గాయపడిన వారిని కాపాడేందుకు ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించేలా 'రహదారి వీరులు' పేరుతో ఒక పథకాన్ని ప్రకటించారు. బాధితులను రక్షించిన వారికి రూ.25,000 నగదు బహుమతి అందిస్తామని గడ్కరీ తెలిపారు. అంబులెన్సుల నిర్వహణ బాధ్యత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలోకి రాదని, రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అవసరాన్ని బట్టి ప్రతి రాష్ట్రానికి 100 నుంచి 150 అంబులెన్సులను అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa