ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాంల నాటి చెరువుకు ప్రాణంపోసిన‌ హైడ్రా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 02:57 PM

 పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువుకు హైడ్రా ప్రాణం పోసింది. క‌బ్జాల‌ను తొల‌గించి ఊపిరిలూదింది. ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించింది. చరిత్ర‌ను త‌వ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్ర‌క వైభ‌వాన్ని హైడ్రా చాటింది. ఇలా పాత‌బ‌స్తీకే మ‌ణిహారంగా  బమ్ -రుక్న్-ఉద్-దౌలా చెరువును స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతోంది.  జ‌న‌వ‌రిలో ఈ చెరువును ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న నేప‌థ్యంలో హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ గారు శ‌నివారం బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయింద‌నుకున్న చ‌రిత్ర‌కు ప్రాణం పోస్తున్నాం.. ప్ర‌తి విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా అక్క‌డ నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న అధికారుల‌ను ఆదేశించారు. చెరువుకు స్థానికులు సుల‌భంగా చేరుకునేలా ర‌హ‌దారుల‌తో పాటు ప్ర‌వేశ ద్వారాలుండాల‌ని సూచించారు.  చెరువు చుట్టూ బండ్‌పై వాకింగ్‌ ట్రాక్‌లను ప‌రిశీలించారు. చెరువు లోప‌లి వైపు ఫెన్సింగ్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న ప్లే ఏరియాలను ప‌రిశీలించారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్క‌డ గ‌జ‌బోలు నిర్మాణాలు న‌లువైపులా ఉండేలా చూడాల‌న్నారు. పార్కులు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. 


 కాంక్రీట్ జంగిల్‌గా న‌గ‌రాలు మారిపోతున్న వేళ‌.. పాత‌బ‌స్తీలో నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీకి చేరువ‌లో అభివృద్ధి చేస్తున్న బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు విహార కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్‌గారు తీర్చిదిద్దాల‌న్నారు. ఔష‌ధ గుణాలున్న వృక్ష జాతితో పాటు.. మొక్క‌ల‌ను చెరువు చుట్టూ నాటాల‌ని సూచించారు. ప‌చ్చిక బైళ్ల‌తో పార్కులు ఆహ్లాద‌క‌రంగా తీర్చిదిద్దాల‌న్నారు. బ‌య‌టకు చెరువు ప‌రిస‌రాల్లో ఉన్న ఉష్ణోగ్ర‌త‌ల్లో తేడా తెలిసేలా.. ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం ఉండేలా చూడాల‌న్నారు. నిజాంల కాలంలో చెరువు నిర్మాణంలో వాడిన రాతిని వినియోగించి క‌ట్ట‌డాన్ని ప‌టిష్టం చేయాల‌న్నారు. ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్‌లు విశాలంగా ఉండేలా చేప‌ట్టిన నిర్మాణాల‌ను చూశారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్ ఇలా 10 కిలోమీట‌ర్ల మేర చెరువుకు వ‌ర్షం నీరు వ‌చ్చేలా ఇన్‌లెట్లు నిర్మించాల‌ని.. ఈ ప్రాంతంలో వ‌ర‌ద క‌ష్టాల‌కు ఈ చెరువు చెక్‌పెట్టేలా చూడాల‌ని సూచించారు. సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి నిఘాను ప‌టిష్టం చేస్తున్నారు. 


 1970లో మూడ‌వ నిజాం సికంద‌ర్ జాహ్ పాల‌న‌లో అప్ప‌టి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న న‌వాబ్ రుక్న్ - ఉద్ - దౌలా ఈ చెరువును నిర్మించార‌ని.. అందుకే బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు పేరు వ‌చ్చింద‌ని చారిత్ర‌క ఆధారాలు చెబుతున్నాయి. తాగు నీటి అవ‌స‌రాల‌ను త‌ర్చేలా 104 ఎక‌రాల మేర ఈ చెరువు విస్త‌రించి ఉంద‌ని చ‌రిత్ర చెబుతోంది. కాల‌క్ర‌మంలో చెరువు విస్తీర్ణం త‌గ్గుతూ హెచ్ ఎం డీ ఏ ఈ చెరువును 17.05 ఎక‌రాలుగా నిర్ధారించింది. చివ‌రికి  4.12 ఎక‌రాలుగా మిగిలిపోయింది. హైడ్రా గ‌త ఏడాది ఆగ‌స్టులో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది. హెచ్ ఎం డీ ఏ పేర్కొన్న విధంగా పూర్తి స్థాయిలో భూమి అందుబాటులోకి తెచ్చింది. ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గిస్తున్న‌ప్పుడు అనేక అవ‌రోధాల‌ను అధిగ‌మించి.. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంది. అలా విమ‌ర్శించిన వారే ఔరా అనేట్టు హైడ్రా ఈ చెరువును అభివృద్ధి చేసింది. ఇప్పుడు స్థానికులు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ల‌లో కూడా ఊహించ‌డం క‌ష్టంగా ఉన్న ఈ ప్రాంతానికి ఇంత అందాన్ని తీసుకువ‌చ్చిన హైడ్రాకు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. 


 అడుగ‌డుగునా చారిత్ర‌క ఆన‌వాళ్లు, ఎన్నో విశేషాలు స్థానికంగా ఉన్న వృద్ధులు ప‌లు విధాలుగా వివ‌రిస్తున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద ఈ చెరువుకు చేరేద‌ని చెబుతున్నారు. నిజాంల‌ కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును రాణులు స్నానాల‌కు వినియోగించేవార‌ని చెబుతున్నారు. అలాగే బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువులో వ‌న‌మూలిక‌ల చెట్లు, కొమ్మ‌లు వేసి.. ఆ దిగువున నిర్మించిన బావిలోకి వ‌చ్చిన ఊట నీటిని  తాగేందుకు నిజాం పాల‌కులు వినియోగించేవార‌ని మ‌రి కొంత‌మంది  వివ‌రిస్తున్నారు.  ఔష‌ధ‌గుణాలున్న ఈ నీటిని మాత్ర‌మే నిజాంలు వినియోగించేవారంటున్నారు. అంతే  కాదు.. ఈ చెరువు చుట్టు సువాస‌న‌లు వెద‌జ‌ల్లే పూల మొక్క‌లు విరివిగా ఉండేవ‌ని.. ఆ పూల‌న్నీ చెరువులో ప‌డ‌డంతో ఇక్క‌డి నీటిని సెంటు త‌యారీకి  వినియోగించేవార‌ని.. ఇందుకోసం అర‌బ్ దేశాల‌కు ఇక్క‌డి నీరు తీసుకెళ్లేవారంటున్నారు.  ఇలా ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ చెరువు మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ప‌లువురు సంబ‌ర ప‌డుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa