ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో ఇల్లు అమ్మే వారు జాగ్రత్త.. బ్రోకర్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 20, 2025, 07:42 PM

హైదరాబాద్ నగరంలో సొంతంగా ఒక ఇల్లు లేదా స్థలం ఉండటం అనేది ఒక కల. అయితే.. ఆ ఆస్తిని అమ్మే సమయంలో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే ఒక సంచలన విషయం ఇప్పుడు బయటపడింది. ఓ నెటిజన్ వీడియో ద్వారా తన క్లయింట్‌కు జరిగిన మోసాన్ని వివరించాడు. ముఖ్యంగా వేరే ఊర్లలో లేదా విదేశాల్లో ఉంటూ హైదరాబాద్‌లో ఆస్తులు అమ్ముతున్న వారిని లక్ష్యంగా చేసుకుని కొంతమంది కిలాడీ మధ్యవర్తులు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఈ మోసం ఎలా జరుగుతుంది.. దీని నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.


మోసం వెనుక ఉన్న మాయాజాలం..


సాధారణంగా మనం ఏదైనా ఆస్తిని అమ్మకానికి పెట్టినప్పుడు.. కొనుగోలుదారులు అని చెప్పి కొంతమంది మధ్యవర్తులు మిమ్మల్ని సంప్రదిస్తారు. వారు చాలా మర్యాదగా మాట్లాడుతూ.. మీ ఆస్తిని మంచి ధరకు కొంటామని నమ్మిస్తారు. ఆ నెటిజన్ చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ ఉన్న వ్యక్తి ఇల్లు అమ్మాకినికి పెట్టాడు. అతడు హైదరాబాద్‌లో కాకుండా.. బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. దానిని కొనేందుకు ఒక మధ్య వర్తి ఫోన్ చేసి తాము తీసుకుంటామని చెప్పడంతో.. అతడి పేరు మీద అగ్రిమెంట్ రాసిచ్చాడు. ఆస్తి విలువ ఒక కోటి రూపాయలు ఉండగా.. వారు ఒక పాతిక లక్షల రూపాయలు బయానా (అడ్వాన్స్) కింద ఇచ్చి ఒక అగ్రిమెంట్ రాయించుకుంటారు. ఇక్కడే అసలు కథ మొదలయింది.


ఈ ఒప్పందం జరిగిన తర్వాత.. మిగిలిన డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారు రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేశారు. నెలలు గడిచినా డబ్బు ఇవ్వలేదు. విసిగిపోయి ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని అంటే.. అప్పుడు వారి అసలు స్వరూపం బయటపడింది. ‘మేము లోకల్, ఈ ఆఫీసుల్లో మాకు పలుకుబడి ఉంది.. మీరు ఈ ఆస్తిని ఇంకెవరికీ అమ్మనివ్వం’ అంటూ బెదిరింపులకు దిగాడు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని కొంతమంది సిబ్బందితో చేతులు కలిపి.. ఆస్తిపై ఉన్న ఒప్పందం రద్దు కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం మొదలు పెట్టినట్లు అతడు చెప్పుకొచ్చాడు.


యజమానుల బలహీనతే వారి పెట్టుబడి..


ఈ మోసగాళ్లు ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను, ఇతర దేశాల్లో ఉండేవారిని ఎంచుకుంటారు. ఎందుకంటే వారు గొడవలకు వెళ్లలేరని.. పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి వారికి సమయం ఉండదని వీరికి తెలుసు. మీరు పోలీసుల దగ్గరికి వెళ్లినా.. ఇది సివిల్ వివాదం అని చెప్పి కోర్టుకు వెళ్ళమని సూచిస్తారు. కోర్టుల్లో ఏళ్ల తరబడి సమయం పడుతుందనే భయంతో.. యజమానులు విసిగిపోయి చివరకు ఆ మోసగాళ్లు అడిగిన తక్కువ ధరకే తమ ఆస్తిని వారికి రాసిచ్చే పరిస్థితి వస్తుంది. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు. అందుకే.. మీ ఆస్తిని అమ్మేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కేవలం మధ్యవర్తుల మాటలు నమ్మి ఒప్పందాలు చేసుకోవద్దు. కొనుగోలుదారు ఎవరు, వారి నేపథ్యం ఏమిటో తెలుసుకోండి.


అగ్రిమెంట్‌లో స్పష్టమైన గడువు (ఉదాహరణకు 60 లేదా 90 రోజులు) ఉండాలి. ఆ గడువులోగా డబ్బు చెల్లించకపోతే.. బయానా సొమ్ము వెనక్కి ఇవ్వబోమని, ఒప్పందం ఆటోమేటిక్‌గా రద్దవుతుందని నిబంధనలు రాయించుకోండి. ఏదైనా పత్రంపై సంతకం చేసే ముందు మీకు తెలిసిన లాయర్ చేత దానిని ఒకసారి చదివించండి. వీలైనంత వరకు పూర్తి సొమ్ము తీసుకున్నాకే ఆస్తిని అప్పగించండి. మీరు ఆ నగరంలో ఉండటం లేదనే విషయాన్ని అందరికీ చెప్పకండి. ఇది కబ్జాదారులకు , మోసగాళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. చివరగా.. ‘అతిగా ఆశపడటం లేదా తొందరపడటం’ అనేవి మోసగాళ్లకు మనం ఇచ్చే ఆయుధాలు. మీ కష్టార్జితమైన ఆస్తిని అమ్మేటప్పుడు ఓపికగా.. తెలివిగా వ్యవహరించండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa