తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా.. ఔటర్ రింగ్ రోడ్డు, ప్రాంతీయ వలయ రహదారి మధ్య ఉన్న ప్రాంతాన్ని గ్రోత్ ఇంజిన్గా మార్చాలని నిర్ణయించింది. ఈ రెండు రహదారుల మధ్య వెలియనున్న 'ఫోర్త్ సిటీ'ని దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు హెచ్ఎండీఏ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్లో ఈ ప్రాంత అభివృద్ధిపై స్పష్టమైన మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా రవాణా రంగాన్ని బలోపేతం చేసేందుకు శాటిలైట్ టౌన్షిప్లతో పాటు, అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్ హబ్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గతంలో పటాన్చెరు మండలం పరిధిలోని లక్డారం, పటాన్చెరులో ఈ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. సుమారు రూ. 1,620 కోట్ల వ్యయంతో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ మరియు ట్రాన్స్ఫర్ పద్ధతిలో వీటిని నిర్మించాలని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు కొత్త విజన్ డాక్యుమెంట్ ద్వారా మరింత వేగం పుంజుకోనుంది. ప్రస్తుతం నగరం వెలుపల బాటసింగారం, మంగళపల్లిలో కేవలం రెండు లాజిస్టిక్ హబ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నగరం చుట్టూ కనీసం 10 లాజిస్టిక్ హబ్లను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ హబ్ల ఏర్పాటు వల్ల సరకు రవాణా వాహనాలు నగరంలోకి రాకుండా శివార్ల నుండే కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇక్కడ కంటెయినర్ డిపోలు, కోల్డ్ స్టోరేజీలు, ఉచిత వేర్హౌస్ జోన్లు, ఫ్రైట్ విలేజ్లను ఏర్పాటు చేయనున్నారు.
ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ఫోర్త్ సిటీ ఈ ప్రాంతంలోనే రానుండటంతో అంతర్జాతీయ కార్గో కాంప్లెక్సులు, సరకు ఉత్పత్తి, ప్యాకింగ్ యూనిట్లు ఇక్కడ కేంద్రీకృతమవుతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. ముఖ్యంగా బ్లూ-గ్రీన్ మొబిలిటీ కింద ప్రజా, సరకు రవాణాకు విడివిడిగా పక్కా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించింది. రైలు, రోడ్డు, విమానయాన మార్గాలకు ఈ లాజిస్టిక్ హబ్లను అనుసంధానించడం ద్వారా హైదరాబాద్ను దక్షిణ భారతదేశపు ప్రధాన రవాణా కేంద్రంగా మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పం.
ఈ బృహత్తర ప్రాజెక్టుల వల్ల శివారు ప్రాంతాల భూముల విలువ పెరగడమే కాకుండా కొత్త పారిశ్రామిక వాడలు వెలిసే అవకాశం ఉంది. అయితే పటాన్చెరు వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న కాలుష్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని పర్యావరణ హితమైన పద్ధతులను అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తే.. హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థలో మరో విప్లవాత్మక అధ్యాయం మొదలవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa