హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తూ, పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ డ్రైవ్లను నిరంతరం కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
మద్యం తాగి పట్టుబడిన వారు తమ పలుకుబడిని ఉపయోగించి తప్పించుకోవాలని చూడొద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తనిఖీల సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడం లేదా రాజకీయ నాయకుల పేర్లు చెప్పడం వంటివి సరికాదని ఆయన సూచించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని ఆయన తనదైన శైలిలో స్పష్టం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన వారు ‘మా డాడీ ఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా?’ అంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావద్దని సజ్జనార్ పేర్కొన్నారు. అటువంటి పరిచయాలు రోడ్డుపై కాకుండా, కోర్టులో చూపిస్తే బాగుంటుందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మీ ప్రైవసీని మేము గౌరవిస్తామని, అందుకే వాహనాన్ని పక్కన పెట్టి సైలెంట్గా వెళ్లాలని, కేటాయించిన తేదీన కోర్టుకు వచ్చి మీ వివరాలు చెప్పుకోవాలని ఆయన సూచించారు.
మద్యం తాగి వాహనం నడపడం వల్ల మీ ప్రాణాలకే కాకుండా రోడ్డుపై వెళ్లే ఇతర అమాయకుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి ఉపేక్ష ఉండబోదని, నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని, సురక్షితమైన ప్రయాణాన్ని సాగించాలని ఆయన నగర ప్రజలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa