ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగర్ కర్నూల్ జిల్లాకు మహర్దశ.. ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 06:55 PM

నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల జాతర కొనసాగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటనలో భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు దాదాపు 40 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రజల చిరకాల కోరికైన రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తూ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఈ పర్యటనలో ప్రధాన ఘట్టంగా నిలిచింది.


నాగర్‌కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల ప్రాంతంలో రవాణా కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య అనుసంధానం పెరగడమే కాకుండా.. వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొనే రాకపోకల ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దీనితో పాటు కేసరి సముద్రం మినీ ట్యాంక్ బండ్ వద్ద మరో బ్రిడ్జి, సిసి రోడ్ల పనులకు కూడా మంత్రి పునాది వేశారు.


పాలమూరు ప్రాంతాన్ని విద్యా మరియు వైద్య హబ్‌గా మార్చడమే లక్ష్యమని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు జూనియర్ కాలేజీ నూతన భవన నిర్మాణానికి 9 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోటి 5 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు రాష్ట్రంలో 109 ట్రామా కేర్ సెంటర్లు, ప్రతి జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం కీమోథెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.


మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద భారీగా రుణాలను పంపిణీ చేశారు. నాగర్‌కర్నూలు పట్టణంలోని 245 మహిళా సంఘాలకు సంబంధించి సుమారు 70 లక్షల 80 వేల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని ఆయన ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సంతోష్ , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 13 కోట్ల రూపాయలతో చేపట్టిన తక్షణ అభివృద్ధి పనులతో పాటు.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa