నారాయణపేట జిల్లా మక్తల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ పెను ప్రమాదం తృటిలో తప్పింది. మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్న ఈ అధికారిక వేడుకల్లో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన అక్కడున్న వారందరినీ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మక్తల్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి శ్రీహరి.. స్థానిక ప్రజలు, విద్యార్థులు, అధికారుల సమక్షంలో మువ్వన్నెల జెండాను ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు.
మంత్రి జెండా తాడును లాగుతున్న తరుణంలో.. ఆ బరువును తట్టుకోలేక జెండాను అమర్చిన చెక్క కర్ర ఒక్కసారిగా మధ్యలోకి విరిగిపోయింది. విరిగిన ఆ కర్ర నేరుగా మంత్రి పైన పడబోయింది. అయితే, ప్రమాదాన్ని ముందే పసిగట్టిన మంత్రి శ్రీహరి అత్యంత వేగంగా పక్కకు తప్పుకోవడంతో ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ, విరిగిపడిన ఆ కర్ర ముక్క అక్కడే ఉన్న మరో వ్యక్తిపై పడటంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆరోగ్య శాఖాధికారులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో అప్పటివరకు ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. జెండా కర్ర నాణ్యత సరిగా లేకపోవడం, అధికారులు నిర్లక్ష్యం వహించడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు విమర్శిస్తున్నారు. మంత్రి పాల్గొనే కార్యక్రమంలో ఇటువంటి భద్రతా లోపాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. జెండా ఎగురవేయడానికి ముందే కర్ర పటిష్టతను ఎందుకు తనిఖీ చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం తప్పిన అనంతరం మంత్రి వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి అశుభ పరిణామం జరగడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఇక దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో గవర్నర్, అసెంబ్లీ శాసనసభ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి ఆవరణలో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పతాకావిష్కరణ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa