ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడికి మరో కీలక పదవి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 28, 2026, 07:21 PM

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీపీసీసీలో ముఖ్యమైన నియామకాలు చేపట్టింది. దీనిలో భాగంగా మంగళవారం ఇద్దరు నేతలకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. వీరిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా ఉన్నారు.


త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించేందుకు టీపీసీసీ ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు టీపీసీసీ ఓబీసీ విభాగంలోనూ నూతన నియామకాలు జరిగాయి. ఓబీసీ విభాగం చైర్మన్‌గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను నియమించేందుకు పార్టీ నాయకత్వం ఆమోదం తెలిపింది. ఆయనతో పాటు ఓబీసీ విభాగం కన్వీనర్లుగా డాక్టర్ కేతూరి వెంకటేశ్, డాక్టర్ జులూరు ధనలక్ష్మిలను నియమించారు. ఈ నియామకాలకు సంబంధించి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవులను భర్తీ చేసినట్లు తెలుస్తోంది.


రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం జనవరి 28 నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 30 వరకు తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి, ఫిబ్రవరి 3న అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. మున్సిపల్ మేయర్లు, చైర్మన్ల ఎంపిక కోసం ఫిబ్రవరి 16న ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa