ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 ముగిసింది. దీంతో గద్దెల సమీపంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ చేపట్టింది. ఆ హుండీలన్నింటినీ మేడారం నుంచి హనుమకొండకు తీసుకువచ్చి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ సిబ్బంది హుండీలను లెక్కిస్తున్నారు. గత 5 రోజులుగా పటిష్ఠ పోలీస్ భద్రత మధ్య లెక్కింపు చేపట్టారు. గత 5 రోజుల్లో 788 హుండీలను లెక్కించగా.. అందులో రూ.11.83 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ లెక్కింపులోనే ఒక హుండీలో కాసులపేరు నగ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎవరో భక్తులు సమర్పించిన ఆ కాసులపేరు బంగారం కాదని దేవాదాయ సిబ్బంది తేల్చారు. గిల్టు నగలతో చేసిన కాసులపేరు అని స్పష్టం చేశారు. అయితే హుండీలో నకిలీ బంగారు, వెండి వస్తువులు రావడం సహజమని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో.. వాటిని కొనే స్థోమత లేని సామాన్య భక్తులు.. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు మొక్కుకుని ఇలా గిల్టు నగలను కూడా సమర్పిస్తుంటారని అధికారులు చెబుతున్నారు.
అయితే కేవలం బంగారం మాత్రమే కాకుండా.. వెండి వస్తువులు కూడా ఇలా నకిలీవి ఉంటాయని పేర్కొంటున్నారు. మరోవైపు.. హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా సోమవారం రోజున మరో 163 హుండీలను లెక్కించారు. వాటిల్లో రూ.1.12 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుందని వివరించారు. సోమవారం నాటికి మొత్తం 788 హుండీలను తెరిచి లెక్కించగా అందులో రూ.11,83,85,116 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
ఇక మేడారం జాతరలో మొత్తంగా 828 హుండీలను ఏర్పాటు చేశారు. మహాజాతర పూర్తి అయిన తర్వాత తిరుగువారం కోసం ఏర్పాటు చేసిన మరో 40 హుండీలను కూడా లెక్కించాల్సి ఉందని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంగా వచ్చిన ఆదాయంలో మేడారం పూజారులకు 33 శాతం ఆదాయాన్ని ఇస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa