ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలియాబాద్‌లో కలిసిన కాంగ్రెస్, బీజేపీ.. కామారెడ్డిలో ఒక్కటైన బీఆర్ఎస్, కాంగ్రెస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 10:13 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి చాలా ప్రాంతాల్లో హంగ్ ఏర్పడటంతో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తై ఫలితాలు వెల్లడైనప్పటికీ.. మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు ఏ పార్టీ దక్కించుకుంటుంది అనేది సర్వత్రా ఆసక్తిని రేపింది. అయితే కొన్ని స్థానాల్లో ఏ పార్టీకి ఓటర్లు స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల నుంచి గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమ వైపు లాక్కునే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేశాయి. అందుకోసం వారికి భారీగా తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి, అలియాబాద్ ఛైర్మన్ల ఎన్నిక ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.


అయితే స్పష్టమైన ఆధిక్యం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో పీఠాలను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఉప్పు నిప్పుల్లా ఉండే పార్టీలు.. నిరంతరం ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శలు చేసుకునే పార్టీలు.. చేతులు కలిపి కొన్ని చోట్ల మున్సిపాలిటీలను దక్కించుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కాంగ్రెస్, బీజేపీ కలిసిపోవడం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటై మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకోవడం గమనార్హం.


మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన కామారెడ్డి మున్సిపాలిటీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతున్న వేళ కామారెడ్డిలో మాత్రం ఆ రెండు పార్టీలు కలిసిపోవడం గమనార్హం. కామారెడ్డి ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులను రెండు పార్టీలు పంచుకున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం 49 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్ఎస్ 11, స్వతంత్రులు 3 గెలిచారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి మున్సిపాలిటీని దక్కించుకున్నాయి.


38వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన ఉమారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఆమెను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఇక వైస్ ఛైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి 12వ వార్డు నుంచి గెలిచిన కాసర్ల గోదావరి ఎన్నికయ్యారు.


మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌ మున్సిపాలిటీ హంగ్ ఏర్పడింది. దీంతో గత 3 రోజులుగా అక్కడ తీవ్ర రాజకీయ ఉత్కంఠ నెలకొంది. అలియాబాద్ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా.. అందులో కాంగ్రెస్ పార్టీకి 8, బీఆర్ఎస్ పార్టీకి 7, బీజేపీకి 3, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఎవరు మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఛైర్మన్ ఎన్నికలో బీజేపీ, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కంఠం శిరీష అలియాబాద్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa