తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఉద్దేశించి మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లో గాంధీ విగ్రహ ఏర్పాటు కోసం.. అక్కడ ఉన్న ఇళ్లను కూల్చేసి.. స్థానికులను వారి ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం సరైన నిర్ణయం కాదని తుషార్ గాంధీ ట్వీట్ చేశారు. మహాత్మా గాంధీ ఆశయాలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. ఒకవేళ గాంధీజీ బతికి ఉంటే తన పేరు మీద, తన విగ్రహ నిర్మాణం కోసం ఇలాంటివి చేయొద్దని చెప్పేవారని.. అందుకే ఈ గాంధీ విగ్రహ ఏర్పాటును వెంటనే ఆపాలని తుషార్ గాంధీ తెలిపారు.
విగ్రహాల ఏర్పాటు కంటే పేద ప్రజల కనీస అవసరాలే తనకు ముఖ్యమని గాంధీజీ నమ్మేవారని ఈ సందర్భంగా తుషార్ గాంధీ పేర్కొన్నారు. అలాంటిది ఆయన విగ్రహాన్ని పెట్టడం కోసం పేదల ఇళ్లను తొలగించడం గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధమని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇండ్లను కూల్చేయడాన్ని ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తుషార్ గాంధీ విజ్ఞప్తి చేశారు.
మూసీ సుందరీకరణ పేరుతో.. నది ఒడ్డున గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇళ్లను కూల్చి విగ్రహం కోసం స్థలాన్ని సేకరించడం గాంధేయ విధానం కాదని తుషార్ గాంధీ తెలిపారు. మూసీ సుందరీకరణ పేరుతో లక్షన్నరకు పైగా ఇళ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
హిమాయత్ సాగర్ నుంచి ప్రారంభమైన మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 24 వేల ఎకరాలను సేకరించాలని ప్రణాళికలు వేసింది. రూ.1.5 లక్షల కోట్లతో చేపట్టనున్న మూసీ సుందరీకరణ కోసం 1.5 లక్షలకు పైగా కుటుంబాలను అక్కడి నుంచి తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే విమర్శలు ఉన్నాయి. అయితే మూసీ సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా కేవలం 3200 ఎకరాలు మాత్రమే సేకరిస్తామని.. 10 వేల నిర్మాణాలే ప్రభావితం అవుతాయని గతేడాది డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో సర్కార్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa