2025 నవంబర్ నెలలో సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిహారం అందించారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 44 మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి.. పరిహారం చెక్లు అందించారు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 44 మంది కుటుంబాలకు పరిహారం అందించారు. నాటి ఘటనలో గాయపడిన వారికి రూ.3 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది.
నాటి దుర్ఘటన సమయంలో ప్రమాదం గురించి తనకు తెలిసిన వెంటనే సహాయ చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం మంత్రి అజారుద్దీన్ను మదీనాకు పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. సాధారణంగా దేశం బయట జరిగే ప్రమాదాలకు ప్రభుత్వాలు పరిహారం చెల్లించవని.. కానీ బాధిత కుటుంబాల పరిస్థితి చూసి సహాయం ప్రకటించామని.. బాధిత కుటుంబాలకు 5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
నాంపల్లి అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలబడిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందనే నమ్మకం కల్గించడం ముఖ్యమన్న రేవంత్ రెడ్డి.. అందుకోసమే బాధిత కుటుంబాలను సెక్రటేరియట్కు పిలిపించి పరిహారం అందించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం మీ ఆనందంతో పాటుగా కష్టంలోనూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
2025, నవంబర్ 17వ తేదీన సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తోన్న బస్సు ఓ డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. మక్కా యాత్ర పూర్తిచేసుకుని మదీనా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో బస్సులో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 45 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉండటంతో ఎక్కువ ప్రాణనష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా హైదరాబాద్కు చెందిన వారేనని హజ్ కమిటీ పేర్కొంది. 18 మంది మహిళలు, 17 మంది మగవారితో పాటుగా, 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు వెల్లడించింది.
ప్రమాదం తెలిసిన వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి సహాయకచర్యలు చేపట్టింది. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించిన ప్రభుత్వం.. పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి.. శనివారం రోజున పరిహారానికి సంబంధించిన చెక్కులు బాధితులకు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa