రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ త్వరలోనే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న NH 365-BG గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యి వాహనదారులకు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రాజమండ్రి మధ్య దూరం తగ్గుతుందని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఖమ్మం–దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల పొడవుతో, దాదాపు రూ. 4,609 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్నట్లు వెల్లడించారు. పచ్చని పొలాల మధ్యగా సాగే ఈ రహదారి ఇతర హైవేలకంటే ప్రత్యేకమని.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చని పేర్కొన్నారు. ఈ హైవే పూర్తి అయితే, హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి వెళ్లేవారికి.. విజయవాడ మార్గం అవసరం లేకుండా, దూరం, సమయం రెండూ గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
మరోవైపు ఖమ్మం - దేవరపల్లి మధ్య నాలుగు వరుసలుగా ఈ యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతోంది. పనులు దాదాపు పూర్తి కాగా.. ఏప్రిల్లో నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 162 కిలోమీటర్లు ఉన్న ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి.. తెలంగాణలో 106 కి.మీ, ఏపీలో 57 కి.మీ మేరకు ఉంది. ఖమ్మం నుంచి ఏలూరు జిల్లా. తూర్పుగోదావరి జిల్లాల మీదుగా దేవరపల్లి వరకూ ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రైస్ హైవే నిర్మాణం జరుగుతోంది.
2017లో ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు రూపొందించగా.. మరుసటి ఏడాది ఆమోదం లభించింది. ఈ హైవే నిర్మాణంలో 10 పెద్ద వంతెనలతో పాటుగా, 49 చిన్న వంతెనలు నిర్మిస్తున్నారు. అలాగే 295 కల్వర్టులు, ఒక ఆర్వోబీ, 98 చోట్ల అండర్పాస్లు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖపట్నం మధ్య 56 కిలోమీటర్లు దూరం తగ్గనుంది.
మరోవైపు ఈ జాతీయ రహదారిపై 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉన్నాయి. అలాగే అత్యవసర సమయాల్లో బాధితులను తరలించేందుకు వీలుగా ఐదు కిలోమీటర్లకు ఒకచోట ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ ఏర్పా్ట్లు ఉన్నాయి. అలాగే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా మాత్రమే ఈ జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి టోల్ వసూలు చేస్తారు. అలాగే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఏర్పాటుచేశారు.. ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక సీసీ కెమెరా ఏర్పాటుచేశారు. సౌరశక్తితో పనిచేసే లైట్లు ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎక్కడున్నామనే సంగతి తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa