చించోడ్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరంపై అధికారుల చర్చించారు. ముఖ్యంగా నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం మరియు నూనె గింజల పంటల సాగు ప్రాముఖ్యతను వివరించి, రైతులను ప్రోత్సహించారు.
సాంప్రదాయ ఎరువుల స్థానంలో నానో యూరియా మరియు నానో డీఏపీ వంటి వినూత్న ఎరువులను వాడటం వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు విపులంగా తెలియజేశారు. ఈ నానో ఎరువులను సరైన మోతాదులో పంటలపై పిచికారీ చేయడం వల్ల మొక్కలకు పోషకాలు నేరుగా అందుతాయని, దీనివల్ల పంట ఎదుగుదల వేగంగా ఉంటుందని పేర్కొన్నారు. రసాయన ఎరువుల మోతాదును తగ్గించి, ఖర్చులను ఆదా చేసుకునే మార్గాలను రైతులకు సోదాహరణంగా వివరించారు.
రసాయనాలతో కూడిన వ్యవసాయం వల్ల భూసారం దెబ్బతింటున్న నేపథ్యంలో, ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని అధికారులు రైతులకు పిలుపునిచ్చారు. పర్యావరణానికి హాని కలగకుండా, ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించేందుకు ప్రకృతి సిద్ధమైన పద్ధతులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. దీనివల్ల పెట్టుబడి తగ్గడమే కాకుండా, మార్కెట్లో నాణ్యమైన ఉత్పత్తులకు మంచి ధర లభించే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, లాభదాయకమైన నూనె గింజల పంటల సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో పండించగలిగే నూనె గింజల రకాలను ఎంచుకోవడం ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం కావచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు నానో ఎరువుల వినియోగంపై ఉన్న సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa