తెలంగాణలో ఈ ఏడాది విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి కాలం ముందే వచ్చేసింది. సాధారణంగా మార్చి మెుదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరగాలి. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే భానుడి భగభగలు మెుదలయ్యాయి. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో అకాల వర్షాలు ముంచెత్తాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తాజాగా.. వాతావరణ శాఖ తెలంగాణకు మరోసారి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18 లేదా 19వ తేదీ తర్వాత తెలంగాణలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత నెల 23-24 తేదీల్లో కురిసిన వర్షాల కంటే ఈసారి వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. అకాల వర్షాల సూచన ఉన్నప్పటికీ.. వర్షాలు ప్రారంభమయ్యే వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు. గరిష్టంగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 36-37 డిగ్రీల మధ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్ నమోదు అవుతుందని చెప్పారు. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇకపై ఎండలు ఎక్కువగా ఉండే మధ్యాహ్నం సమయంలో ప్రయాణాలు తగ్గించుకోవాలని వాతావరణశాఖ అధికారులు సూచనలు జారీ చేశారు. అతి త్వరలోనే వడగాల్పులు కూడా ప్రారంభమవుతాయని హెచ్చరించారు. ఈ ఏడాది వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. ముఖ్యంగా నల్గొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ఎండ గాలుల తీవ్రత ఎక్కువగా నమోదవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వృద్ధులు, చిన్నారులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. భారీ వర్షాలకు అనుగుణంగా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa