తెలంగాణలో మహిళా శక్తికి ఆరోగ్య భరోసా కల్పించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కీలక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో తయారు చేసిన హెల్త్ మిషన్-100 (100 రోజుల ఆరోగ్య మిషన్) కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆ రోజు నుంచి ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ హెల్త్ మిషన్-100లో భాగంగా ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. మహిళా దినోత్సవం నాడు ప్రత్యేకంగా మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
మరీ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద మహిళలు పడే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఈ వైద్య పరీక్షలను వచ్చే 6 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా మహిళలే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సెర్ప్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న సుమారు 42 లక్షల నుంచి 46 లక్షల మంది మహిళలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి కల్పించనున్నారు. ప్రతి మహిళకు టీ-డయాగ్నస్టిక్స్ నెట్వర్క్ ద్వారా దాదాపు 30 రకాల ముఖ్యమైన మెడికల్ టెస్ట్లను ప్రభుత్వం ఫ్రీగా చేయనుంది. కేవలం సాధారణ వైద్య పరీక్షలకే పరిమితం కాకుండా.. మహిళలకు వచ్చే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లను కూడా ఈ మెడికల్ టెస్టుల్లో చేర్చారు. ఈ మొత్తం స్క్రీనింగ్ ప్రక్రియను 4 దశల్లో విభజించి.. రానున్న 6 నెలల కాలంలో పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతీ మహిళకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
అంతేకాకుండా.. ఈ 100 రోజుల ఆరోగ్య మిషన్ కేవలం మహిళలకు మెడికల్ పరీక్షలకే కాకుండా ప్రతీ మహిళకు ఒక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ను తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం వల్ల భవిష్యత్తులో వారికి ఏదైనా అనారోగ్యం వస్తే.. వారి పూర్తి మెడికల్ హిస్టరీ ఆన్లైన్లో ఒక్క క్లిక్తో అందుబాటులోకి రానుంది. దాని వల్ల వీలైనంత తొందరగా.. మెరుగైన చికిత్స అందించేందుకు వీలు కానుంది.
వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో వడదెబ్బ, డయేరియా సహా ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా.. నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ 100 రోజుల మిషన్లో చేర్చారు. పాలీ క్లినిక్లను అభివృద్ధి చేయడం.. మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలకు సంబంధించి.. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ హెల్త్ మిషన్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోంది. దీని వల్ల తెలంగాణలోని మహిళలకు ఒక బలమైన ఆరోగ్య భద్రతను కల్పించామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa