టీమిండియా అమ్మాయిలు అదరగొట్టేశారు. ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో విజేతలుగా నిలిచారు. ఇవాళ మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన టోర్నీ ఫైనల్లో భారత మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. బౌలింగ్ లో 3 వికెట్లు తీయడమే కాకుండా, ఓపెనర్ గా బరిలో దిగి 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. త్రిష స్కోరులో 8 ఫోర్లు ఉన్నాయి.మరో ఓపెనర్ జి.కమలిని 8 పరుగులకే అవుటైనా వన్ డౌన్ బ్యాటర్ సనికా చల్కేతో కలిసి త్రిష ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించింది. సనికా చల్కే 22 బంతుల్లో 4 ఫోర్లతో 26 పరుగులు చేసింది. సనికా చల్కే విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టి టీమిండియా శిబిరాన్ని సంబరాల్లో ముంచెత్తింది. సఫారీ బౌలర్లలో కెప్టెన్ కేలా రీనెకె 1 వికెట్ తీసింది. కాగా, ఇప్పటివరకు ఈ టోర్నీ రెండు సార్లు నిర్వహించగా రెండు పర్యాయాలు టీమిండియానే టైటిల్ సాధించింది. 2023లో జరిగిన ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించి చాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండోసారి టోర్నీలో విజేతగా అవతరించింది.