బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) లో ఓ ఫ్రాంచైజీని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఆటగాళ్లను హోటల్ నుంచి మైదానానికి తీసుకువెళ్లే బస్ డ్రైవర్ కు జీతం ఇచ్చేందుకూ ఫ్రాంచైజీ వద్ద సొమ్ము లేదట. దీంతో చిర్రెత్తుకుపోయిన డ్రైవర్ క్రికెటర్ల కిట్ లకు తాళం వేశాడు. తన జీతం ఇస్తేనే తాళం తీస్తానని పట్టుబట్టాడు. డ్రైవర్ పరిస్థితి ఇలా ఉండగా సదరు ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు వారి స్వదేశానికి వెళ్లలేకపోతున్నారట. వారు బస చేసిన హోటల్ బిల్లులు చెల్లించకపోవడంతో క్రికెటర్లు చెక్ ఔట్ చేయడానికి ఆయా హోటళ్ల యాజమాన్యాలు అంగీకరించడంలేదు. బీపీఎల్ లో డర్బార్ రాజ్షాహి జట్టు ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. జట్టు తరఫున ఆడిన క్రికెటర్లకు పేమెంట్ చేయడానికి డబ్బుల్లేవంటూ చేతులెత్తేసింది. ఈ ఘటనపై బస్ డ్రైవర్ మహమ్మద్ బాబుల్ మాట్లాడుతూ.. టోర్నీ జరిగినన్ని రోజులు ఆటగాళ్లను హోటల్ కు, గ్రౌండ్ కు తిప్పానని చెప్పాడు. బస్ కిరాయితో పాటు తనకు ఇవ్వాల్సిన జీతంలో పెద్ద మొత్తం జట్టు యాజమాన్యం బకాయి పెట్టడం సిగ్గుచేటని అన్నాడు. కిట్లలో స్వదేశీ, విదేశీ ప్లేయర్లకు చెందినవి ఉన్నాయని, తనకు ఇవ్వాల్సిన మొత్తం ఇస్తే తప్ప కిట్ లను ఇవ్వలేనని తేల్చిచెప్పాడు.