టీమిండియా డాషింగ్ ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ తన వరెస్ట్ ఫామ్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన హిట్మ్యాన్ ఇంగ్లండ్ టూర్తో అయినా ఫామ్లోకి వస్తాడు అనుకున్న ఫ్యాన్స్కి నిరాశే మిగిలింది. ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో రోహిత్ ఆట తీరు అందర్నీ కలవరపెడుతోంది.
నాగ్పూర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. ఏడు బంతులు ఆడిన రోహిత్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. షాకీబ్ మహమూద్ బౌలింగ్లో మిడ్ వికెట్కు వచ్చిన బంతిని మిడాన్లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. రోహిత్ ఆట తీరు చూసిన టీమిండియా ఫ్యాన్స్ రిటైర్మెంట్కి వేళాయరా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.
టీమిండియా 2024-25లో ఆడిన అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 16 ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ పదహారు ఇన్నింగ్స్లలో హిట్ మ్యాన్ కేవలం 10.37 యావరేజ్తో 166 పరుగులు మాత్రమే చేశాడు. చివరగా ఆడిన పది ఇన్నింగ్స్లలో రోహిత్ అత్యధిక పరుగులు 18 మాత్రమే. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రోహిత్ ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇక క్రికెట్కు చివరి రాగం పాడక తప్పదంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
రోహిత్ శర్మ చివరి పదహారు ఇన్నింగ్స్ల స్కోర్స్ను ఓ సారి పరిశీలిస్తే 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9, 2. పదిసార్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్కే పెవలియన్ బాట పట్టాడు. ఇంగ్లండ్తో జరగనున్న మిగతా రెండు మ్యాచ్లలోనైనా బాధ్యతాయుతమైన స్కోర్ చేసి మునుపటి ఫామ్లోకి వస్తాడో? రాడో? వేచి చూడాలి మరి.
![]() |
![]() |