ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌పై పాక్‌దే పైచేయి.. జోస్యం చెప్పిన అక్తర్

sports |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 10:08 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అందరి దృష్టి భారత్-పాక్ మ్యాచ్ పైనే ఉంది. దాయాది జట్ల మధ్య దైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో ఇరు జట్ల పోరుకు ఐసీసీ ఈవెంట్లే మార్గమయ్యాయి. ఈ రెండు జట్లు చివరగా టీ20 వరల్డ్ కప్‌లో పోటీపడగా టీమిండియానే విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం పాక్‌దే పైచేయిగా ఉండబోతుందంటూ ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ జోస్యం చెప్పాడు.


దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 23న జరిగే భారత్-పాక్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు టీమిండియాను ఓడిస్తుంది అంటూ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేవిధంగా భారత్-పాక్ మధ్యే ఫైనల్ ఉండబోతుందంటూ అక్తర్ జోస్యం చెప్పాడు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో 180 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి పాకిస్తాన్ టైటిల్ సొంతం చేసుకుంది.


భారత ఉపఖండంలోని జట్లే సెమీ ఫైనల్‌లో ఉండబోతున్నాయని కూడా అక్తర్ చెప్పాడు. సెమీ ఫైనల్స్‌కు చేరుకునే నాలుగు జట్లలో మూడు భారత ఉపఖండంలోనివే అని చెప్పుకొచ్చాడు. భారత్, పాకిస్తాన్‌తో పాటు మూడో జట్టుగా అప్ఘనిస్తాన్ వెళ్లనుందంట. నాలుగో జట్టుగా న్యూజిలాండ్‌కి అక్తర్ అవకాశం ఇచ్చాడు.


అప్ఘనిస్తాన్ జట్టు తన ఆట తీరును రోజురోజుకూ మెరుగుపరుచుకుంటూ వస్తోంది. చివరగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ అందరి అంచనాలను తలకిందులు చేసి పెద్ద జట్లను ఖంగుతినిపించింది. అందుకే సెమీ ఫైనల్స్ లిస్ట్‌లో అప్ఘనిస్తాన్ జట్టుకు అక్తర్ అవకాశం ఇచ్చాడు.


ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజేత ఆస్ట్రేలియాకు అక్తర్ తన లిస్టులో చోటు కూడా ఇవ్వలేదు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లను అసలు మర్చిపోయాడు. తొలిసారి అతిపెద్ద ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న పాకిస్తాన్‌‌‌‌‌‌లో ఏ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. భారత్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం దుబాయ్ వేదిక కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com