భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో పర్యాటక ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి వన్డేలో 250 రన్స్ కూడా చేయకుండానే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ బ్యాటర్లు.. రెండో వన్డేలో మాత్రం మెరుగైన ప్రదర్శన చేశారు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై 300కిపైగా పరుగులను చేశారు. దీంతో టీమిండియా ముందు సవాల్ విసిరే లక్ష్యాన్ని నిలిపారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిజం చేస్తూ.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (26), బెన్ డకెట్ (65) తొలి వికెట్కు 10.4 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. అయితే ఈ మ్యాచ్తోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫిల్ సాల్ట్ను ఔట్ చేసి భారత్కు తొలి వికెట్ అందించాడు. సాల్డ్ ఔట్ అయినా.. డకెట్కు జత కలిసిన జో రూట్ (69) స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఓ దశలో 15.5 ఓవర్లలో 102/1తో నిలిచిన ఇంగ్లాండ్.. భారీ స్కోరుపై కన్నేసినట్లే కనిపించింది.
ఈ క్రమంలో దూకుడుగా ఆడుతున్న బెన్ డకెట్ను రవీంద్ర జడేజా తన తొలి ఓవర్లోనే పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత హ్యారీ బ్రూక్, రూట్లో హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని.. హర్షిత్ రాణా విడదీశాడు. బ్రూక్ సిక్స్ కొట్టేందుకు ప్రయత్నించగా.. గాల్లోకి లేచిన బంతిని గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి సూపర్ క్యాచ్ పట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ 250 పరుగుల మార్కును ఈజీగానే దాటింది.
ఇక చివర్లో లియామ్ లివింగ్స్టోన్ (41), అదిల్ రషీద్ (14) కొన్ని షాట్లు ఆడటంతో ఇంగ్లాండ్ 300 పరుగులను దాటింది. చివరకు మరో బంతి మిగిలి ఉండగానే ఇంగ్లాండ్.. 304 రన్స్కి ఆలౌటైంది. చివరి నాలుగు ఓవర్లలో ఇంగ్లాండ్ బ్యాటర్లు 43 పరుగులు రాబట్టడం గమనార్హం. ఇక భారత బౌలర్లలో రవీంద్ర జడేజా అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తిలు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ముగ్గురు రనౌట్ అయ్యారు.
![]() |
![]() |