ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాజాలోకి పాలస్తీనియన్లకు తిరిగి ప్రవేశించే హక్కు ఉండదు..కాకరేపుతున్న ట్రంప్ వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 11:10 PM

2023 అక్టోబరు 7 నాటి నరమేథానికి ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయేల్.. హమాస్ అంతమే లక్ష్యంగా సాగించిన భీకర దాడులతో ధ్వంసమైన గాజాను స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రతిపాదిత ప్రణాళిక ప్రకారం.. గాజాలోకి పాలస్తీనియన్లకు తిరిగి ప్రవేశించే హక్కు ఉండదని అన్నారు. ఈ మేరకు ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు గాజా ప్రణాళిక గురించి మాట్లాడారు.


‘‘నేను గాజాను వశం చేసుకుంటా. నా ప్లాన్ ప్రకారం.. పాలస్తీనీయన్ల కోసం గాజా బయట ఆరు ప్రాంతాలు ఉంటాయి’’ అని ట్రంప్‌ తెలిపారు. మరి పాలస్తీనీయన్లు తిరిగి గాజాలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. అటువంటి అవకాశం లేదని తేల్చిచెప్పారు. నగరం బయట వారికి ఇంతకంటే మంచి గృహ వసతులు ఉంటాయని స్పష్టం చేశారు. ‘వేరే మాటల్లో చెప్పాలంటే నేను వారికోసం శాశ్వత నివాసాలను నిర్మించడం గురించి మాట్లాడుతున్నాను.. ఎందుకంటే దాడుల్లో శిథిలమైనపోయి నివాసయోగ్యంగా మారింది.. వాటిని పునర్నిర్మించుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది’ అని అన్నారు.


‘ప్రమాదం పొంచి ఉన్న ప్రదేశానికి దూరంగా ఐదు లేదా ఆరు సురక్షితమైన కమ్యూనిటీలను నిర్మిస్తాం.. ఈలోగా నేను గాజాను స్వాధీనం చేసుకుంటాను. దీనిని రియల్ ఎస్టేట్ అభివృద్ధిగా భావించండి.. భవిష్యత్తులో ఇది ఓ అందమైన ప్రదేశం అవుతుంది. పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా, గతవారం అమెరికాలో పర్యటించిన ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతన్యాహుతో కలిసి డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. గాజాను స్వాధీనం చేసుకునే ప్రణాళికను వెల్లడించారు. దీనిపై పాలస్తీనియన్లతో పాటు ఇతర దేశాలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.


కాగా, తదుపరి దశ బందీల విడుదల విషయంలో హమాస్‌ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయేల్ ఉల్లంఘిస్తోందని ఆరోపించిన హమాస్... తదుపరి బందీల విడుదల ప్రక్రియలో జాప్యం తప్పదని వెల్లడించింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఏ మేరకు సజావుగా కొనసాగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతోన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది.


16 నెలల పాటు కొనసాగిన దాడుల నుంచి ఉపశమనం కలిగిస్తూ.... గాజాలో జనవరి 19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకు ఇరుపక్షాల మధ్య 5 సార్లు పరస్పరం బందీలు, పాలస్తీనా పౌరుల విడుదల జరిగింది. తమ వద్ద ఉన్న బందీల్లో 21 మందిని హమాస్‌ అప్పగించగా.. 730 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయేల్‌ విడుదల చేసింది. తదుపరి విడత శనివారానికి నిర్ణయించగా.. హమాస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com