ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో బుమ్రా ఉంటాడా ఉండడా

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 11, 2025, 11:32 PM

టీమిండియా ఫ్యాన్స్‌ అందరికీ చెమటలు పట్టిస్తున్న ప్రశ్న ఒకే ఒక్కటి.. అదే బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో ఉంటాడా? ఉండడా? ఆల్‌మోస్ట్ క్రికెట్ ఫ్యాన్స్‌ అందరూ ఇప్పుడు ఇదే చర్చించుకుంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆయా దేశాలు తమ తమ జట్టులను ఫైనలైజ్ చేయాల్సిన రోజు ఫిబ్రవరి 11. బుమ్రా జట్టులో ఉంటాడా? ఉండడా? అనేది ఇప్పటి వరకు కనీసం ఒక క్లారిటీ లేదు.


పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. జనవరిలోనే టీమిండియా స్క్వాడ్‌ని ప్రకటించి అందులో బుమ్రా పేరును కూడా చేర్చారు. కానీ, ఇప్పటి వరకు బుమ్రా జట్టులో ఉంటాడా, ఉండడా అన్న క్లారిటీ లేదు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గాయపడిన బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇంకా బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్నాడు.


యాభై ఓవర్లు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా పది ఓవర్ల పాటు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. దాని కోసమే బెంగళూరు ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేస్తున్నాడట. వరుసగా రెండు, మూడు ఓవర్ల కంటే ఎక్కువ బౌలింగ్ వేయలేకపోతున్నాడట. నాలుగు ఓవర్లకు పైగా బుమ్రా బౌలింగ్ వేయగలిగితే ఫిబ్రవరి 11 అర్ధరాత్రి తర్వాత టీమిండియా స్క్వాడ్‌లో బుమ్రా పేరును చేర్చుతారు. టీమిండియా ఫ్యాన్స్ అందరూ బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాలని కోరుకుంటున్నారు.


 బుమ్రా లేకపోతే..?


ఒకవేళ జట్టులో బుమ్రా లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటి అనేది కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బుమ్రా స్థానాన్ని ఎవరితో ఫిల్ చేస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌లో చోటు కల్పించని మహమ్మద్ సిరాజ్‌ని తీసుకోవాలని కొందర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుండగా.. టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ దృష్టి మాత్రం హర్షిత్ రాణాపై ఉందని తెలుస్తోంది. అందుకే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లోనూ అర్షదీప్‌ని పక్కనబెట్టి మరీ హర్షిత్ రాణాతో బౌలింగ్ చేయిస్తున్నాడు.


వన్డే వరల్డ్ కప్ తర్వాత జట్టులోకి తిరిగొచ్చిన మహమ్మద్ షమీ అంతగా రాణించలేకపోతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే మ్యాచ్‌లలోనూ షమీ తనదైన మార్క్ చూయించలేకపోయాడు. ఇక టీ20 బౌలర్ అర్షదీప్ సింగ్ 50 ఓవర్ల మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో తెలియదు. హర్షిత్ రాణాకు దుబాయ్ పిచ్‌లపై ఆడిన అనుభవం లేదు. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా లేకపోతే భారత్ పరిస్థితి ఏంటనే టెన్షన్‌లో క్రికెట్ అభిమానులు ఉన్నారు.


సిరాజ్ వైపే మొగ్గు


క్రికెట్ విశ్లేషకులు, సీనియర్లు దుబాయ్ పిచ్‌లపై సిరాజ్ రాణించగలడన్న నమ్మకంతో ఉన్నారు. దుబాయ్‌లోని స్లో పిచ్‌లపై మహమ్మద్ సిరాజ్ వికెట్లు తీయగలడని, గతంలో కూడా ఆడిన అనుభవం ఉందని చెబుతున్నారు. చివరి రెండేళ్లలో భారత్ తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసిన బౌలర్‌ కూడా సిరాజ్ కావడం విశేషం. బుమ్రా పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకపోతే సిరాజ్‌కు అవకాశం ఇస్తారా లేక మొండిచేయి చూపిస్తారా అనేది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com