ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ కేసులు, బెదిరింపులతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలను భయపెట్టలేరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 05:49 PM

​కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌ మండిపడ్డారు.  మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారని.. చట్టం మీ చుట్టం అనుకుంటున్నారా? అంటూ ఆయ‌న ధ్వజమెత్తారు. గురువారం జూపూడి ప్ర‌భాక‌ర్ మీడియాతో మాట్లాడారు.‘‘వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసులు, బెదిరింపులతో వైయ‌స్ఆర్‌సీపీ నేతలను భయపెట్టలేరు. వంశీ 24 గంటల్లో బయటకు వస్తారు. కుట్రలతో చేస్తున్న మీ చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నేతలు గూండాల్లా బరి తెగిస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారు.


సత్యవర్థన్‌ నిజం చెప్పినా తప్పుడు కేసులు పెడుతున్నారు. సత్యవర్థన్‌ ఉపసంహరించుకున్న కేసులో వంశీ అరెస్ట్‌ ఏంటి?’’ అంటూ జూపూడి ప్రభాకర్‌ ప్రశ్నించారు.‘‘తనతో తప్పుడు కేసు పెట్టించారని సత్యవర్ధన్ కోర్టులో జడ్జి ముందే చెప్పాడు. రాష్ట్రంలో రాతియుగం నాటి పాలన సాగుతోంది. కోర్టులు, చట్టాలు అంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదు. కొందరు పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. వంశీ అరెస్టు అన్యాయం, అక్రమం. టీడీపీ ఆఫీసుపై దాడి చేసింది వారి పార్టీ కార్యకర్తలే. కానీ వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. సత్యవర్ధన్ ఎస్సీ అని ఆయన్ను వేధిస్తున్నారు’’ అని జూపూడి త‌ప్పుప‌ట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించటానికి వెయ్యి గొంతులు బయటకు వస్తాయి. అరెస్టులతో వైఎస్సార్‌సీపీ భయపెట్టలేరు. పాలకులు చట్టబద్దంగా వ్యవహరిస్తే మంచిది. అధికార దుర్వినియోగం చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. చట్టమే ఉరితాడుగా మారి మీ గొంతులకు బిగిస్తుంది జాగ్రత్త. వంశీ అరెస్టుతో కూటమి ప్రభుత్వం అధ:పాతాళానికి పోయింది. సుప్రీంకోర్టులో ఉన్న‌ కేసు అంటే కూడా పోలీసులకు లెక్క లేకుండా పోయింది. బాధితుల మీదనే తిరిగి కేసులు పెట్టే దారుణమైన పరిస్థితి ఏర్పడింది. అధికారం లేనందున వైయ‌స్ఆర్‌సీపీ నేతలంతా లొంగిపోతారనుకోవటం అవివేకం. అక్రమ కేసులు పెట్టటం నుండి సాక్ష్యం చెప్పించే వరకు ఎవరెవరు ఏ పని చేయాలో కూడా పోలీసులే నిర్ధారిస్తున్నారు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. చట్టాలు, రాజ్యాంగాన్ని గౌరవించండి’’ అని జూపూడి ప్రభాకర్‌ హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com