ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేసిన షాహీన్ అఫ్రిదీ,,,గట్టి కౌంటర్ ఇచ్చిన భారత వైస్ కెప్టెన్‌

sports |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 10:14 PM

వన్డేల్లో నంబర్‌ వన్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ ఛాంపియన్స్ ట్రోఫీ లో అదరగొడుతున్నాడు. గత కొన్ని రోజులుగా పరుగుల వరద పారిస్తున్న టీమిండియా వైస్ కెప్టెన్.. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొట్టిన ఈ ప్లేయర్.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 46 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.


 అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌.. షాహీన్ అఫ్రిదీపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ 15 బంతుల్లో 20 రన్స్ చేశాడు. ఒక సిక్స్‌, మూడు ఫోర్లు బాదాడు. అయితే ధాడిగా ఆడే క్రమంలోనే షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్థాన్ అభిమానులు అతిగా సంబురాలు చేసుకున్నారు.


మరో ఎండ్‌లో బ్యాటింగ్‌ చేస్తూ ఇదంతా చూసిన శుభ్‌మన్‌ గిల్‌కు చిర్రెత్తుకొచ్చింది. మా కెప్టెన్‌నే ఔట్ చేస్తావా అంటూ.. షాహీన్ అఫ్రిదీపై ఎదురుదాడికి దిగాడు. రోహిత్‌ను ఔట్ చేశాక అతడు వేసిన తర్వాతి ఓవర్లోనే చుక్కలు చూపించాడు. మూడు ఫోర్లు సహా ఆ ఓవర్‌లో 14 పరుగులు రాబట్టాడు. తన మార్క్ షాట్లలో అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.


ఇక ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపుదిశగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్ నిర్దేశించిన 242 పరుగులను ఛేదించేలా దూసుకెళ్తోంది. 26 ఓవర్లు ముగిసే సరికి భారత్.. 128/2తో నిలిచింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా క్రీజులో ఉన్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి.. సెమీస్ బెర్తును ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa