ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛాంపియన్స్ ట్రోఫీతో రూ.869 కోట్ల నష్టం

sports |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 10:38 PM

ఐసీసీ లాంటి మెగా ఈవెంట్ జరిగిందంటే ఆ దేశానికి కాసుల పండగే అని చెప్పొచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఐసీసీ టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తుంటాయి. కానీ పాపం పాకిస్తాన్‌కు మాత్రం భారీ నష్టం వచ్చింది. అంతా ఇంతా కాదు ఏకంగా రూ.869 కోట్ల నష్టం వచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాక్కోలేక పీక్కోలేక అల్లాడుతోంది. చివరికి చేసేదేమీ లేక ఈ నష్టాన్ని అంతటిని ప్లేయర్ల దగ్గర నుంచి లాక్కొంటోంది.


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 15న మొదలైంది. దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో మ్యాచ్‌లు జరిగినప్పటికీ ఎక్కువ మ్యాచ్‌లు మాత్రం పాకిస్తాన్‌లోనే జరిగాయి. పాకిస్తాన్‌కు తమ జట్టును పంపేది లేదంటూ బీసీసీఐ తెగేసి చెప్పడంతో టీమిండియా మ్యాచ్‌లు మాత్రమే దుబాయ్ వేదికగా జరిగాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 9 వరకు జరిగిన ఈ ట్రోఫీలో టీమిండియా ఛాంపియన్స్‌గా నిలిచింది.


టెలిగ్రాఫ్ ప్రకారం పాకిస్తాన్‌లోని క్రికెట్ స్టేడియంల అభివృద్ధికి ఏకంగా రూ.557 కోట్లను ఖర్చు చేశారు. కరాచీ, లాహోర్, రావల్పిండిలోని మూడు స్టేడియంలను ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా అభివృద్ధి చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్స్ కోసం మరో రూ.346.7 కోట్లను ఖర్చు చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ హోస్ట్ చేస్తున్నందుకు ఐసీసీ నుంచి రూ.52 కోట్లు మాత్రమే అందాయి.


ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్లు, స్పాన్సర్ల రూపంలో పాకిస్తాన్‌కు వచ్చింది మాత్రం చాలా తక్కువ అమౌంటే. పాకిస్తాన్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడటం ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో మాత్రమే కరాచీలో ఆడింది. రెండో మ్యాచ్ భారత్‌తో ఆడేందుకు దుబాయ్ వెళ్లింది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో మూడో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.


రిపోర్ట్‌ల ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల పీసీబీకి రూ.869 కోట్ల నష్టం వాటిల్లింది. 1996 వన్డే వరల్డ్‌కప్ తర్వాత దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ హోస్ట్ చేసినా కూడా ఇలా నష్టం రావడంతో పీసీబీ తలదించుకోవాల్సి వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో వచ్చిన రూ.869 కోట్ల నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడింది. దేశీయ టీ20 టోర్నమెంట్‌లో ఆడే వాళ్ల మ్యాచ్ ఫీజులో 90 శాతం, రిజర్వ్ ప్లేయర్లకు 87.5 శాతం కోత విధిస్తున్నారట. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మ్యాచ్ ఫీజుని రూ.40,000 నుంచి రూ.10,000కు కుదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com