ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 20, 2025, 11:09 AM

జగన్‌ మీడియాతోపాటు ఆయనకు భజన చేసిన కొన్ని టీవీ చానళ్లు, మరిన్ని యూట్యూబ్‌ చానళ్లు, సోషల్‌ మీడియాకు నిబంధనలు ఉల్లంఘించి రూ.వందల కోట్లు ప్రకటనల రూపంలో దోచిపెట్టిన ఐ అండ్‌ పీఆర్‌ మాజీ కమిషనర్‌ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీచేసింది. వచ్చేవారం గుంటూరు ఏసీబీ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలో పనిచేస్తున్నారు. ఈ-మెయిల్‌ ద్వారానేగాక హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ నోటీసులు పంపింది. కేంద్ర సర్వీసుల(ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీ్‌స)కు చెందిన విజయ్‌కుమార్‌రెడ్డి.. జగన్‌ పాదయాత్ర సమయంలోనే ఆయనకు మద్దతు ప్రకటించారు. ఆయన అధికారంలోకి వచ్చాక 2019లో డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. 2024 వరకు సమాచార శాఖ కమిషనర్‌గా విచ్చలవిడి వ్యవహారాలు చేపట్టారు. జగన్‌ సొంత మీడియాతోపాటు అనుకూల మీడియా, భజన మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో అడ్డగోలుగా వందల కోట్లు దోచిపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి గత ఏడాది గద్దెనెక్కిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ వ్యదహారంపై విజిలెన్స్‌-ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి విజయ్‌కుమార్‌రెడ్డిపై గుంటూరులో కేసు నమోదు చేశారు. వచ్చే వారంలో ఆయనతోపాటు ఇంకొందరు లబ్ధిదారులను ప్రశ్నించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com