‘హత్య’ సినిమాపై వైఎస్ వివేకానంద రెడి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేశారు. వివేకా హత్యపై తీసిన ఈ సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. తాను 39 నెలలపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నానని, ఆ సమయంలో తండ్రిని సైతం కోల్పోయానని సునీల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం తన తల్లితో సహా పులివెందుల పోలీస్ స్టేషన్కు వెళ్లి డీఎస్పీ మురళీనాయక్కు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేసి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఇదే అంశంపై మూడు రోజుల కిందట కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో పోలీసులు శనివారం వేకువజామున కేసు నమోదు చేశారు.
‘హత్య’ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయితలను ఇందులో నిందితులుగా పేర్కొన్నారు. ఈ సినిమా సన్నివేశాలను ‘వైఎస్ అవినాష్రెడ్డి అన్న యూత్’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి, వైరల్ చేసినట్లు సునీల్ ఆరోపించారు. ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ను మొదటి నిందితుడిగా, వైఎస్ఆర్సీపీ కడప సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ను రెండో నిందితుడిగా చేర్చారు. వీరితోపాటు మరికొందరి పేర్లను చేర్చి కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. పవన్కుమార్ను శనివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైమ్ స్టేషన్లో విచారణ అనంతరం పులివెందులకు తరలించారు.
కాగా, ఇటీవలే సునీల్ యాదవ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనతోపాటు తన తల్లి వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్న వారి బండారం బయటపెడతానంటూ హెచ్చరికలు చేశారు. ఇదిలా ఉండగా, తన తండ్రి హత్య కేసు విచారణలో జాప్యంపై వివేకా కుమార్తె.. సునీతా రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హత్య జరిగి ఆరేళ్లు అయినా ఇప్పటి వరకూ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని, నిందితులను ఇంకా పట్టుకోలేదని ఆమె ఆరోపించారు. సీబీఐ విచారణ త్వరగా పూర్తయ్యేలా చూడలని సునీత కోరారు.
![]() |
![]() |