ఐపీఎల్ మ్యాచ్ పాస్ ల కోసం తమను ఒత్తిడి చేస్తోందంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని సన్ రైజర్స్ తన ఈ-మెయిల్ లో పేర్కొంది. ఉప్పల్ స్టేడియంలో ఓ మ్యాచ్ సందర్భంగా వీఐపీ బాక్స్ కు తాళం వేసుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ ఆరోపణలపై హెచ్సీఏ స్పందించింది. ఈ నెల 29న ఈ-మెయిల్ ద్వారా సన్ రైజర్స్ ఆరోపణలకు సమాధానం ఇచ్చామని వెల్లడించింది. సన్ రైజర్స్ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడు వ్యక్తిగతంగా టికెట్లు అడగలేదని, కేవలం క్లబ్ కార్యదర్శుల కోసమే టికెట్లు అడిగారని వివరణ ఇచ్చింది.
![]() |
![]() |