భారత జట్టు టెస్టు ఓపెనర్ యశస్వి జైశ్వాల్.. దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టును వీడి గోవాకు వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్నేళ్లుగా ముంబై తరఫున ఆడుతూ.. జాతీయ జట్టులో చోటు సంపాదించిన ఈ ప్లేయర్.. సడెన్గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేశారు. ఇందుకు గల కారణాలపై ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోవా జట్టు.. జైశ్వాల్కు కెప్టెన్సీ ఆఫర్ చేసిందని.. స్టార్ ప్లేయర్లు ఉన్న ముంబై కంటే తనను తాను నిరూపించుకోవడానికి అదే సరైన టీమ్ అని జైశ్వాల్ భావించాడనే విశ్లేషణలు వచ్చాయి.
తాజాగా జైశ్వాల్ జట్టు మార్పుపై ఓ కారణం వెలుగులోకి వచ్చింది. ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానేతో పొసగకపోవడమే జైశ్వాల్.. జట్టు మారేందుకు కారణమని తెలుస్తోంది. తన కమిట్మెంట్పై మేనేజ్మెంట్, కెప్టెన్ రహానే అసంతృప్తి వ్యక్తం చేయడం జైశ్వాల్కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది. ఒకానొక దశలో జైశ్వాల్.. కోపంలో అజింక్య రహానే కిట్బ్యాగ్ను కూడా తన్నినట్లు సమాచారం.
అంతర్జాతీయ క్రికెటర్లు కూడా దేశవాళీల్లో ఆడాలని.. బీసీసీఐ ఇటీవల కొత్త రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జమ్ము కాశ్మీర్తో ముంబై తలపడ్డ మ్యాచులో జైశ్వాల్ ఆడాడు. ఆ మ్యాచులో తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 26 రన్స్ మాత్రమే అతడు చేశాడు. ఈ మ్యాచులో ముంబై అనూహ్యంగా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఆ తర్వాత ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్.. ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయం కోసం కష్టపడే వారే జట్టుకు కావాలని.. టీమిండియాకు అందుబాటులో ఉంటామని నిరూపించుకోవడానికి ఆడేవారు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరూ తననే టార్గెట్ చేసినట్లు జైశ్వాల్ భావించాడట.
అంతేకాకుండా 2022లో ఓ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ రహానేతో జైశ్వాల్కు విభేదాలు తలెత్తాయట. దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ప్రత్యర్థి అటగాడిని జైశ్వాల్.. స్లెడ్జ్ చేశాడు. దీంతో అతడు మైదానం నుంచి వెళ్లాలని యశస్విని.. రహానే ఆదేశించాడు. ఈ విషయంపై అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న జైశ్వాల్.. తాజాగా జట్టు మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
![]() |
![]() |