ట్రెండింగ్
Epaper    English    தமிழ்

15 ఏళ్ల తర్వాత చెపాక్‌లో మళ్లీ ఆ సీన్ రిపీట్

sports |  Suryaa Desk  | Published : Sat, Apr 05, 2025, 10:42 PM

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో ఒకటిగా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 18వ ఎడిషన్‌లో వరుసగా విజయాలు నమోదు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి.. విజయాల హ్యాట్రిక్ నమోదు చేసింది. అటు ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం.. ఓటముల హ్యాట్రిక్‌ను తన పేరిట లిఖించుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌పై 25 రన్స్ తేడాతో గెలిచిన ఢిల్లీ.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.


చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్.. అక్షర్ పటేల్.. ఫస్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77 రన్స్‌) చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 రన్స్ చేసింది. అభిషేక్ పోరెల్ (20 బంతుల్లో 33 రన్స్‌) కూడా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 1, నూర్ అహ్మద్ 1, మతీశ పథిరాన ఒక్కో వికెట్ చొప్పున తీశారు.


అనంతరం 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. పవర్‌ప్లే ముగిసే సరికే మూడు వికెట్లు కోల్పోయి.. ఛేజింగ్‌లో వెనకబడింది. రచిన్ రవీంద్ర (3), డెవాన్ కాన్వే (13), రుతురాజ్ గైక్వాడ్ (5) విఫలమయ్యారు. శివమ్ దూబె (18) కూడా తొలి పది ఓవర్లలోపే ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి ఖాయమైంది.


విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ చివరి వరకూ క్రీజులో ఉన్నా.. మ్యాచ్‌ను మాత్రం గెలిపించలేకపోయారు. నిదానంగా బ్యాటింగ్ చేశారు. విజయ్ శంకర్ (54 బంతుల్లో 69 రన్స్‌), మహేంద్ర సింగ్ ధోనీ (26 బంతుల్లో 30 రన్స్‌) ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమైంది. 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ 2 వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, కుల్‌దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు. అయితే.. ఇదే మ్యాచ్‌లో మరో అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. చెపాక్‌లో చివరిసారిగా ఢిల్లీ క్యాపిటల్స్ 2010లో సీఎస్కేను ఓడించగా.. మళ్లీ 15 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com