ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే అలా అనుకుని ఉంటే జగన్ కనీసం కాలు పెట్టేవారా,,,,పరిటాల సునీత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 08, 2025, 07:20 PM

వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వచ్చారా లేదా ప్రచారం కోసమా అని ప్రశ్నించారు. జగన్ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని సునీత ఆరోపించారు. అనంతపురంలో పులివెందుల తరహా హత్యలు జరగవంటూ పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే తాము అనుకుని ఉంటే జగన్ ఈ గడ్డపై అడుగు పెట్టే వారే కాదని అన్నారు. ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపైనా, స్థానిక టీడీపీ నాయకత్వంపై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ వ్యాఖ్యలకు పరిటాల సునీత కౌంటర్ ఇచ్చారు. వైఎస్ జగన్‌ది పరామర్శ కాదని, ప్రచారం కోసం చేసిన రాజకీయ విన్యాసమని పరిటాల సునీత ఆరోపించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన మాటల్లో నిజం లేదని మండిపడ్డారు.


వైఎస్ జగన్ తన నియోజకవర్గానికి వచ్చి తనను టార్గెట్ చేస్తూ మాట్లాడారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు నవ్వుకు, ఏడుపుకు తేడా తెలియదని సెటైర్లు వేశారు. పరామర్శకు వచ్చారా లేక అభిమానులతో జేజేలు పలికించుకుంటూ, జగన్ సీఎం అని అనిపించుకోవడానికి వచ్చారా అని ప్రశ్నించారు. సెల్ఫీలు తీసుకుంటూ పరామర్శలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు. జగన్ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని.. మాజీ ముఖ్యమంత్రి, నోటి నుంచి ఒక్క నిజమైన మాట రాలేదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెప్పిన అబద్ధపు మాటలు విని, విషయం తెలుసుకోకుండా జగన్ రెచ్చగొడుతున్నారని విమర్శించారు.


జగన్ అబద్ధాలు పేపర్ పై రాసుకొచ్చి మాట్లాడారన్న పరిటాల సునీత.. లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను , తన కుమారుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. తాము కావాలంటే ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునే వారమని అన్నారు. అలా అనుకుని ఉంటే వైఎస్ జగన్ నాయన వచ్చినా తమను ఆపలేరని.. కానీ అంత నీతిమాలిన రాజకీయాలు చేయదలచుకోలేదని పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు.


మరోవైపు వైఎస్ జగన్‌కు పరిటాల సునీత ఛాలెంజ్ చేశారు. ఆరోపణలపై బైబిల్ మీద ప్రమాణం చేయాలని, తాను భగవద్గీత మీద ప్రమాణం చేస్తానని సవాల్ చేశారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చేతకాని దద్దమ్మ అంటూ పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ నాయకులు, కార్యకర్తలు, తాము అనుకుని ఉంటే వైఎస్ జగన్ ఈ గడ్డ మీద అడుగు పెట్టేవారు కాదంటూ సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com