ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలులో డీఆర్డీఓ ప్రయోగం సక్సెస్,,,భారత్ అమ్ముల పొదిలో గేమ్ ఛేంజర్ అస్త్రం

national |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 09:23 PM

భారత సైన్యం అత్యాధునిక ఆయుధ వ్యవస్థను సమకూర్చుకుంటోంది. ఈ క్రమంలో త్వరలోనే లేజర్‌తో పనిచేసే కొత్త సాంకతిేకత కలిగిన ఆయుధం భారత సైన్యం అమ్ముల పొదిలో చేరనుంది. లేజర్ ఎనర్జీ ఆధారిత ఎంకే 2 ఆయుధాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ  విజయవంతంగా పరీక్షించింది. లేజర్ కిరణాతో శత్రువుల డ్రోన్లు, క్షిపణులను కూల్చే సత్తాకలిగిన ఈ ఆయుధాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఆదివారం ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్టు డీఆర్డీఓ తెలిపింది.. ఈ ఆయుధం భారత సైన్యానికి ఒక గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆయుధం ప్రాధాన్యత మరింత పెరిగింది.


కర్నూలులో వెహికల్ మౌంటెడ్ లేజర్ ఎనర్జీ డైరెక్టెడ్ వెపన్ (డీఈడబ్ల్యూ) ల్యాండ్ వెర్షన్‌ పరీక్ష విజయవంతమైనట్టు పేర్కొంది. ఈ సందర్భంగా ఫిక్స్‌డ్‌ వింగ్ యూఏవీ, డ్రోన్ల సమూహాన్ని డీఈడబ్ల్యూ ఎంకే-2(ఏ) ధ్వంసం చేసింది. అంతేకాకుండా నిఘా వ్యవస్థను కూడా పనిచేయకుండా చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, శక్తివంతమైన లేజర్ డీఈడబ్ల్యూ వ్యవస్థలు కలిగిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ చేరింది. ఈ విషయాన్ని డీఆర్‌డీవో తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో తెలిపింది.


డీఆర్‌డీవో షేర్ చేసిన వీడియోలో.. లేజర్ కిరణాల లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని చూడొచ్చు. ‘ఇప్పటి వరకు ఇలాంటి వ్యవస్థను ప్రదర్శించిన దేశాల్లో రష్యా, అమెరికా, చైనా ఉన్నాయి. ఇజ్రాయేల్ కూడా ఇదే తరహా ప్రయత్నాలు చేస్తోంది. దీనిని బట్టి మనం 4 లేదా 5వ స్థానంలో ఉన్నాం’ అని డీఆర్‌డీవో ఛైర్మన్ సమీర్ తెలిపారు. ఈ ఆయుధం మనకు 'స్టార్ వార్స్' సామర్థ్యాన్ని అందిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రయోగానికి డీఆర్‌డీవోకు చెందిన పలు ల్యాబ్‌లు, పరిశ్రమలు సహకరించాయని ఆయన చెప్పారు. ‘తాజా ప్రయోగం స్టార్ వార్స్ సాంకేతికతలో మొదటిది మాత్రమే" అని ఆయన పేర్కొన్నారు.


సైనికులకు ఘనంగా వీడ్కోలు పలికి.. భావోద్వేగానికి గురైన వయనాడ్ వాసులు


దేశీయంగా రూపొందించిన ఎంకే-2(ఏ) డీఈడబ్ల్యూ లేజర్ ఆయుధం అత్యంత వేగంగా లక్ష్యాలను ఛేదించగలదు. ఇది డ్రోన్ల గుంపులను, శత్రు నిఘా వ్యవస్థలను కూడా అడ్డుకోగలదు. మెరుపు వేగంతో, ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకుంటుంది. ఈ ఆయుధం రూపకల్పనలో డీఆర్‌డీవోకు చెందిన సెంటర్ ఫర్ హైఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్‌) హైదరాబాద్, ఎల్‌ఆర్‌డీఈ, ఐఆర్‌డీఈ, డీఎల్‌ఆర్‌ఎల్‌తో పాటు పలు విద్యాసంస్థలు, పరిశ్రమలు పాల్గొన్నాయి. ఈ ఆయుధ వ్యవస్థతో మందుగుండు సామగ్రి వినియోగం తగ్గుతుంది.


ఈ లేజర్ అస్త్రం ఎంకే-2(ఏ) డీఈడబ్ల్యూ రాడార్ లేదా ఎలక్ట్రో ఆప్టిక్ (ఈవో) వ్యవస్థ ద్వారా లక్ష్యాలను గుర్తిస్తుంది. వెంటనే కాంతి వేగంతో దూసుకుపోయి 30 కిలో వాట్ల సామర్థ్యంతో లేజర్ పుంజాలను ప్రయోగించి లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. ఇది శత్రు డ్రోన్ల నిర్మాణాన్ని నాశనం చేయడంతో పాటు వార్‌హెడ్‌లను కూడా పేల్చివేస్తుంది. ప్రస్తుతం చాలా దేశాలు డ్రోన్ ఆధారిత యుద్ధాలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లేజర్ అస్త్రం ప్రాముఖ్యత మరింత పెరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com