పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ నుంచి ప్రతీకారం తప్పదని నిద్రలేని రాత్రులు గడుపుతున్న పాకిస్థాన్కు ఇప్పుడు మరో భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ కదలికలను గుర్తించేందుకు నియంత్రణ రేఖ వెంబడి పలు చర్యలు చేపట్టింది. ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. భారత్ వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందన్న భయంతో, వాటిని గుర్తించేందుకు సియోల్ కోట్ సెక్టార్లోని పలు ప్రాంతాలకు తన రాడార్ వ్యవస్థను తరలిస్తోంది. అలాగే, ఫిరోజ్పూర్ సెక్టార్కు ఎదురుగా భారత కదలికలను గుర్తించేందుకు పాక్ ఆర్మీకి చెందిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిటాచ్మెంట్స్ను కూడా మోహరిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోర్ కంటోన్మెంట్ సైట్లో పాకిస్థాన్ టీపీఎస్-77 రాడార్ను మోహరించింది. టీపీఎస్-77 మల్టీ రోల్ రాడార్ అనేది అత్యాధునిక సామర్థ్యం కలిగిన రాడార్ వ్యవస్థ. వైమానిక ట్రాఫిక్ను పర్యవేక్షించేందుకు దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. మరోవైపు, పాకిస్థాన్ వరుసగా ఐదో రోజు కూడా నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకున్నా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లపై కాల్పులు జరిపింది. భారత సైన్యం వాటిని సమర్థంగా తిప్పికొట్టింది.
![]() |
![]() |