భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, దేశంలో నివసిస్తున్న పాకిస్థానీయుల వీసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత గడువులోగా వారంతా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. నేటితో గడువు ముగుస్తోంది. ఈ ఆదేశాలను అనుసరించి తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ జితేందర్ పర్యవేక్షణలో, హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్లో నమోదైన పాకిస్థాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. విదేశీయులు నిబంధనల ప్రకారం శంషాబాద్లోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు.పోలీసుల ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో, హైదరాబాద్లో నివసిస్తున్న నలుగురు పాకిస్థాన్ పౌరులు నగరాన్ని వీడి వెళ్లారు. వీరిలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఆమె కుమార్తె, మరో మహిళ ఉన్నట్లు తెలిసింది. స్వల్పకాలిక వీసాలపై ఉన్న పాక్ పౌరులకు "లీవ్ ఇండియా" పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయ మార్గం లేదా అటారీ సరిహద్దును ఉపయోగించుకోవాలని పోలీసులు వారికి సూచించినట్లు సమాచారం. గడువు తర్వాత కూడా దేశంలోనే కొనసాగితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
![]() |
![]() |