ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్జియంలో మెహుల్ చోక్సీ అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Mon, Apr 14, 2025, 09:27 PM

గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్  కుంభకోణంలో ప్రధాన నిందితుడు.. పరారీలో ఉన్న మేహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్  వర్గాలు వెల్లడించాయి. చోక్సీని శనివారం అరెస్ట్ చేసి, జైలుకు తరలించినట్టు పేర్కొన్నాయి. మెహుల్ చోక్సీ, మరో వజ్రాల వ్యాపారి. అతడి మేనల్లుడు నీరవ్ మోదీ ఇద్దరూ రూ. 13,850 కోట్ల మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను మోసం చేసినట్లు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులు నమోదయ్యాయి.


ముంబయి కోర్టు జారీచేసిన వారెంట్ల సాయంతో చోక్సీని అరెస్టు చేసినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ వారెంట్లు మే 23, 2018, జూన్ 15, 2021 తేదీలలో జారీ చేసింది. తన ఆరోగ్య పరిస్థితి, ఇతర కారణాలను చూపుతూ చోక్సీ బెయిల్‌పై విడుదలకు ప్రయత్నించే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు బెల్జియం అధికారులు చోక్సీని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే అతడ్ని భారత్‌కు అప్పగిస్తారని తెలుస్తోంది.


మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి మోసపూరితంగా వేల కోట్లు రుణాలు తీసుకున్నారనేది ఆరోపణ. జనవరి 2018లో ఈ కుంభకోణం వెలుగులోకి రావడానికి ముందు ఇద్దరూ దేశం నుంచి పరారయ్యారు. గత నెల బెల్జియం విదేశాంగ శాఖ.. మేహుల్ చోక్సీ తమ దేశంలోనే ఉన్నట్లు ధ్రువీకరించింది. ‘అతడి ఉనికి గురించి మాకు తెలుసు, దీనికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాం’ అని వారు పేర్కొన్నారు. అయితే, వారు వ్యక్తిగత కేసులపై మాట్లాడటానికి నిరాకరించారు.


బ్యాంకులే నన్ను ముంచాయి: నీరవ్ మోడి


నిఘా నివేదికల ప్రకారం.. చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీ చోక్సీతో కలిసిఆంట్వేర్స్‌లో నివసిస్తున్నాడు. మెహుల్ చోక్సీకి అంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం ఉంది. ఆ ద్వీప దేశం నుంచి అతడు ఇక్కడకు వచ్చాడని చెబుతున్నారు. 2021లో అంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీ.. తరువాత కరేబియన్ దేశం డొమినికాలో కనిపించాడు. రుణాలు ఎగ్గొట్టిన మేహుల్ చోక్సీకి సంబంధించిన రూ. 22,280 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.


ఇక, పీఎన్బీ కేసు వెలుగులోకి రావడానికి ముందు భారత్ నుంచి పరారైన నీరవ్‌ మోదీ యూకేలోనే ఉన్నాడని బ్రిటన్‌ ప్రభుత్వం భారత్‌కు సమాచారం అందించింది. ఈ నేపథ్యంలోనే నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్‌ కోరగా.. 2019 మార్చిలో నీరవ్‌ మోదీని బ్రిటన్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఈ వ్యవహారం బ్రిటన్ కోర్టులో ఉండటంతో నీరవ్ అప్పగింతలో జాప్యం జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com