ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు.. తెలంగాణలో హై అలెర్ట్

Crime |  Suryaa Desk  | Published : Thu, Apr 24, 2025, 10:56 PM

కశ్మీర్‌ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తత నెలకొంది. తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌ నగరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 25, 26న భారత్ సమిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్, హైటెక్ సిటీ, పాతబస్తీ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కౌంటర్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుమానితులపై నిఘా పెంచారు.


రెండ్రోజుల క్రితం కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా భావిస్తున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆ దాడి జరిపారు. మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడే పహల్గాం బైసరన్ ప్రాంతంలోకి ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి అక్కడ ఉన్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అడవిలోకి పారిపోగా ఈ చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదులను పట్టుకునేందుకు దేశ రక్షణ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల ముప్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో జరిగే భారత్ సమిట్–2025, మే 7 నుంచి ప్రారంభమయ్యే మిస్ వరల్డ్–2025 వంటి కీలక కార్యక్రమాల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌ వంటి ప్రధాన కేంద్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సీఎస్ శాంతికుమారి ఆదేశాల మేరకు డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీస్ అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. భారత్ సమిట్‌ సందర్భంగా 100 దేశాల నుంచి ప్రతినిధులు, మిస్ వరల్డ్‌కు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ రానుండటంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.


సైబరాబాద్‌ పరిధిలోని కార్యక్రమాల ప్రాంతాలు గురువారం రాత్రి నుంచే భద్రతా కవరేజీ కిందకి తీసుకుంటున్నారు. హైటెక్ సిటీ, పర్యాటక ప్రాంతాలు, పాతబస్తీ లాంటి కీలక ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా చర్యలు ముమ్మరం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్‌ ఆధ్వర్యంలో అనుమానితులపై నిఘా కొనసాగుతోంది. హైదరాబాద్‌‌‌‌ నగరంలో ఇప్పటికే టెర్రరిస్టుల దాడులకు గురైన ప్రాంతాలు సహా అనేక పర్యాటక ప్రాంతాల్లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. కౌంటర్ ఇంటెలిజెన్స్‌‌‌‌ ద్వారా ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు. అనుమానితులు, సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్టమైన నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరుగుతుండటంతో పోలీస్ యంత్రాంగం సవాల్‌‌‌‌గా తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు కార్యాచరణ రూపొందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com