ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో ఆగిపోయిన పెళ్లి

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:01 PM

సాధారణంగా భారత్, పాక్ సరిహద్దుల్లో ఉండే ప్రాంతాల ప్రజలు.. దేశం దాటి సంబంధాలు చూసుకోవడం, పెళ్లిళ్లు చేసుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఇలాగే రాజస్థాన్‌కు చెందిన ఓ యువకుడు.. పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు కూడా వారి పెళ్లి చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే వీరి పెళ్లికి అడుగడుగునా ఆటంకాలే ఎదురయ్యాయి. వారిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత 3 ఏళ్లుగా వీసాల కోసం ఎదురుచూడగా.. అవన్నీ పూర్తై.. ఈనెల 30వ తేదీన పెళ్లి నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో వారి పెళ్లికి మరో అడ్డంకి నెలకొంది.


పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారి పెళ్లిపై మరో సందిగ్ధం నెలకొంది. రాజస్థాన్ బార్మర్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల శైతాన్ సింగ్ అనే యువకుడికి.. పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్ జిల్లాకు చెందిన కేసర్ కన్వర్‌కు పెళ్లి కుదిరి 4 ఏళ్ల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలోనే వారి కుటుంబ సభ్యులకు వీసాలు రావడానికి 3 ఏళ్లు పట్టింది.


ఎట్టకేలకు ఈ సమస్యలన్నీ ముగిసి.. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన వారికి వీసాలు లభించాయి. దీంతో ఏప్రిల్ 30వ తేదీన పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. ఇలాంటి సమయంలో తాజాగా జరిగిన ఉగ్రదాడి కారణంగా మరో సమస్య తలెత్తింది. ఈ నెలాఖరులో జరగాల్సిన పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి తాజాగా అట్టారి సరిహద్దుకు శైతాన్ సింగ్ చేరుకున్నాడు. కానీ.. ప్రస్తుతం భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది శైతాన్ సింగ్, అతడి కుటుంబ సభ్యులను వెనక్కి పంపించేశారు. దీంతో తన వివాహం ఎప్పుడు జరుగుతుందో అని తెలియక అతడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఈ పెళ్లి కోసం శైతాన్ సింగ్, అతని కుటుంబ సభ్యులకు ఇచ్చిన వీసాల గడువు మే 12వ తేదీతో ముగియనుంది. దీంతో 4 ఏళ్లుగా పెళ్లి కోసం ఎదురుచూస్తున్న శైతాన్ సింగ్‌.. ఇప్పుడు తన పెళ్లి జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో పడ్డాడు.


తమ పెళ్లి కోసం రెండు కుటుంబ సభ్యులు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. రెండు దేశాల మధ్య అట్టారీ-వాఘా సరిహద్దులను రెండు దేశాలు మూసివేయడంతో వధువు ఇంటికి వెళ్లే దారులు మూసుకుపోయాయి. దీంతో తనకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ మీడియా ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఉగ్రవాదులు చేసింది తప్పే.. సరిహద్దు మూసివేతతో పాకిస్తాన్‌కు వెళ్లడానికి అనుమతించడం లభించడం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని శైతాన్ సింగ్ పేర్కొన్నాడు. మరోవైపు.. శైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడి చాలా దురదృష్టకరమైందని.. తెలిపాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com