ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్‌పై అగ్రరాజ్యం కదన రంగంలోకి దిగడానికి కారణాలేంటి?

international |  Suryaa Desk  | Published : Tue, Mar 03, 2026, 07:26 PM

అమెరికా, ఇరాన్ మధ్య వైరం గురించి తెలియాలంటే కాలక్రమంలో 75 ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పట్లో ఇరాన్ ప్రధానిగా మహ్మద్ మొసాదేగ్ ఉండేవారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొసాదేగ్.. ఇరాన్‌లోని చమురు సంపదను జాతీయం చేశారు. ఇరాన్ నిర్ణయంతో నష్టపోతామని భావించిన అమెరికా, బ్రిటన్ (ఎందుకు నష్టపోతాయనేది తర్వాత చూద్దాం) కలిసి కుట్రపన్ని మొసాదేగ్ పదవి నుంచి దిగిపోయేలా చేశాయి. ఆ తర్వాత తమకు అనుకూలుడైన మొహ్మద్ రెజా షా పహ్లవీ (చక్రవర్తి)కు ఇరాన్ పాలన పగ్గాలు దక్కేలా చేశాయి. అయితే తమ దేశంలో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఇరాన్ ప్రజలు భావించారు.


ఇజ్రాయెల్ చిన్న సైతాన్.. అమెరికా పెద్ద సైతాన్..


షా హయాంలో చమురు సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉండటం, విపరీతమైన నిఘా, ఇస్లామిక్ సంప్రదాయాలను పక్కనపెట్టడం లాంటివి ఇరాన్ ప్రజలకు నచ్చలేదు. దీంతో 1979లో అయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ విప్లవం సమయంలోనే టెహ్రాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించి.. 52 మంది అమెరికన్లను 444 రోజులపాటు బందీలుగా ఉంచారు. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. షా అధికారంలో ఉన్న సమయంలో ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అయితే ఖొమేనీ అధికారంలోకి వచ్చాక ఇజ్రాయెల్‌ను శత్రుదేశంగా పరిగణించారు. ఇజ్రాయెల్‌ను చిన్న సైతన్ అని, అమెరికాను పెద్ద సైతాన్ అని ఇరాన్ పిలుస్తుంది.


అమెరికా నచ్చని అంశాలు..


చమురు నిల్వలు అత్యధికంగా ఉన్న పశ్చిమాసియాలో చైనా, రష్యాల ప్రాబల్యం పెరిగితే అమెరికా అగ్రరాజ్య హోదాకు గండిపడుతుంది. ఈ రెండు దేశాలు మిడిల్ ఈస్ట్‌లో పాగా వేయకుండా చూడటానికి, తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నించింది. అయితే తమ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం చెలాయించడం ఇరాన్‌కు నచ్చలేదు. అదే సమయంలో లెబనాన్, సిరియా, యెమెన్ లాంటి దేశాల్లో అమెరికాను వ్యతిరేకించే గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేక గ్రూపులకు టెహ్రాన్ సపోర్ట్ చేయడం అగ్రరాజ్యానికి నచ్చలేదు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థితి నిప్పు-ఉప్పులా మారింది. ఇరాన్ రూపొందించిన ఖండాంతర క్షిపణులతో తనకు ముప్పు ఉందని భావించడంతోపాటు టెహ్రాన్ చేతికి అణ్వాయుధాలు వెళ్లడం ప్రమాదకరమనే భయం అమెరికాలో ఉంది.


అందుకే 2015లో అమెరికాతోపాటు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా, జర్మనీ కలిసి ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం.. దానికి బదులుగా ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను తొలగించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. అయితే 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటకొచ్చేశారు.


గత ఏడాది ఇజ్రాయెల్‌ దాడులు..


ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం చేస్తున్న ప్రయత్నాలు సహజంగానే ఇజ్రాయెల్‌ను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న హమాస్, హెజ్బొల్లా లాంటి సంస్థలకు ఇరాన్ మద్దతు ఉంది. ఒకవేళ న్యూక్లియర్ బాంబు తయారు చేయడంలో ఇరాన్ విజయం సాధిస్తే.. తన మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ఇజ్రాయెల్ భయపడుతోంది. దీంతో 2025 జూన్‌లో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌కు రక్షణ పరంగా బలమైన మిత్రదేశమైన అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఇరాన్‌లోని మూడు అణుకేంద్రాలపై యూఎస్ దాడులు చేసింది. 2025 జూన్ 24న ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన చేశారు.


ఆ తర్వాత కూడా ఇరాన్ అణు కార్యకలాపాలు ఆపకపోవడం అమెరికా ఆగ్రహానికి కారణమైందని చెబుతారు. తనను హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నిందని, దీని వెనుక ఖమేనీ హస్తం ఉందని ట్రంప్ ఆరోపించారు. అంతేగాకుండా.. ఇరాన్‌లోని ఇస్లామిక్ ప్రభుత్వాన్ని గద్దె దింపి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌లో ఖమేనీ పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు ప్రారంభించాయి.


1970ల్లో సౌదీ అరేబియా, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ అమ్మకాలు డాలర్లలో మాత్రమే జరగాలి. దీని వల్ల చమురు కొనుగోలు చేయాలనుకునే ప్రతి దేశానికి డాలర్లు అవసరం అయ్యాయి. ఫలితంగా డాలర్‌కు డిమాండ్ పెరిగిపోయింది. దీన్నే పెట్రో డాలర్లు అంటారు. కానీ గత కొంత కాలంగా ప్రపంచ దేశాలు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. అమెరికాపై రుణభారం పెరగడం లాంటి ఇతర కారణాలు కూడా తోడవడంతో డాలర్ బలహీనపడటం మొదలైంది. సౌదీ సైతం చైనా లాంటి దేశాలకు ఇతర కరెన్సీల్లో చమురు విక్రయించడానికి మొగ్గుచూపుతోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే అమెరికా డాలర్‌కు డిమాండ్ తగ్గిపోయి.. ఆ దేశం అగ్రరాజ్యాన్ని హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది.


పెట్రోడాలర్ ఆధిపత్యం కోసం?


ప్రపంచంలోకెల్లా అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులాపై ఈ ఏడాది జనవరిలో దాడి చేసిన అమెరికా.. ఆ దేశ అధ్యక్షుడు మదురోను బంధించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చమురు, సహజవాయువు నిల్వలు ఎక్కువగా ఉన్న ఇరాన్‌ను సైతం అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ఈ రెండు దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంటే.. చమురు నిల్వలపై నియంత్రణతోపాటు.. డాలర్ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం సాధ్యపడుతోందని అమెరికా భావన. అదే సమయంలో చైనా, రష్యాలకు కూడా చెక్ పెట్టొచ్చు. ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 90 శాతానికిపైగా చైనానే కొనుగోలు చేస్తోంది, అది కూడా డాలర్లలో కాకుండా ఇతర చెల్లింపు మార్గాల్లో. అమెరికా ఆంక్షలతో డిస్కౌంట్ ధరలకే చైనాకు ఇరాన్ చమురును విక్రయిస్తోంది. మరో వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్ తక్కువ ధరకే డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేస్తోంది. ఇప్పుడు అమెరికా, దాని మిత్రపక్షాలతో ఇరాన్ యుద్ధం చేయాల్సి వస్తోంది. కాబట్టి ఆ దేశం నుంచి రష్యాకు ఆయుధాల సరఫరా ఆగిపోవచ్చు. అంటే, ఇరాన్‌పై దాడి వల్ల అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడంతోపాటు.. బీజింగ్, మాస్కోలను సైతం ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa