ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌పై ప్రతీకారం.. భారత్ ముందు 4 ఆప్షన్లు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:13 PM

జమ్మూ కాశ్మీర్‌ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ సమీపంలో ఉన్న బైసరన్ లోయలో మంగళవారం.. లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉండే ఉగ్ర సంస్థ "ది రెసిస్టెన్స్ ఫ్రంట్"కు చెందిన ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గత 3 రోజుల నుంచి దేశవ్యాప్తంగా.. ఈ ఘటన తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక ఈ దాడికి ప్రతీకారం తప్పకుండా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు తీవ్ర హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అయితే పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని సోషల్ మీడియాలో నెటిజన్లు.. డిమాండ్ చేస్తున్నారు. ఉగ్రవాదులే కాకుండా వారికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్‌కుకూడా తగిన శాస్తి జరగాలని కోరుకుంటున్నారు.


పహల్గామ్‌లో చేసిన మారణహోమానికి ఉగ్రవాదులను వదిలిపెట్టకూడదని.. వారికి ధీటైన జవాబు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడికి ఎప్పుడు, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకోనుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా.. అంతర్జాతీయ సమాజం కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అయితే దీనిపై కొందరు నిపుణులు తమ అంచనా చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రతీకార దాడి చేసేందుకు భారత్‌ ముందు 4 మిలిటరీ ఆప్షన్లు ఉన్నాయని పేర్కొంటున్నారు.


ప్రస్తుతం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వద్ద అత్యాధునిక ఫైటర్‌ జెట్లు అయిన రఫేల్‌, మిరాజ్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి పాకిస్తాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు చేయడం అనేది భారత వైమానిక దళం ముందు ఉన్న మొదటి ఆప్షన్‌. అదే సమయంలో గతంలో బాలాకోట్‌పై భారత్ చేసిన దాడి తర్వాత నెలకొన్న పరిణామాలు మళ్లీ జరగకుండా చూసుకోవాల్సి ఉంది. ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు రఫేల్‌, మిరాజ్‌ ఫైటర్ జెట్‌లకు ఉన్నాయి. అయితే భారత్ ఈ నిర్ణయం తీసుకుంటే అందుకు అంతర్జాతీయంగా వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.


లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ను దాటి దాడులు


భారత్‌-పాక్ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని దాయాది దేశం బెదిరించింది. అంటే రెండు దేశాల మధ్య ఉన్న నియంత్రణ రేఖను పాక్ గుర్తించనట్లు అవుతుంది. దీని వల్ల భారత్‌ కూడా దూకుడుగా సైనిక ఆపరేషన్లు చేపట్టే అవకాశం కల్పిస్తుంది. ఇటీవల ఎల్‌ఓసీ వద్ద పాకిస్తాన్‌ చేసిన సరిహద్దు ఉల్లంఘనలను కారణంగా చూపి.. లైన్ ఆఫ్ కంట్రోల్‌ను దాటి అక్కడ ఉన్న ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్‌ ఆపరేషన్లు చేపట్టవచ్చు. ఇది భారత్‌ ముందు ఉన్న రెండో ఆప్షన్‌. అయితే ఈ నిర్ణయం తీసుకుంటే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు భారత దళాలకు పెను సవాల్‌గా మారుతాయి. ఈ ఆపరేషన్లకు ఎక్కువ సమయం పట్టడం.. ఇప్పటికే పలు బలమైన పొజిషన్లలో పాకిస్తాన్‌ దళాలు ఉండటం భారత సైన్యానికి ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.


భారీ టార్గెట్స్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌


శత్రు దేశ భూభాగంలో ఉన్న భారీ టార్గెట్లను గుర్తించి వాటిపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేయడం భారత్‌ ముందు ఉన్న మరో ఆప్షన్‌. అయితే ప్రస్తుతం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రెండు దేశాలు అలర్ట్ కావడంతో పాక్ కూడా సరిహద్దుల్లో భారీగా సైనిక, ఆయుధ సంపత్తిని పోగు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సర్జికల్‌ స్ట్రైక్స్ అంత సులువు కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ విజవంతంగా పూర్తి చేయాలంటే రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌, శక్తివంతమైన దళాలు, కచ్చితమైన ప్లానింగ్‌ తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది.


శతఘ్నులు, స్నైపర్లతో కాల్పులు


పాక్ గడ్డపై ఉన్న కీలక లక్ష్యాలను గుర్తించి.. వాటిపై భారీ శతఘ్నులు, స్నైపర్‌ గన్స్‌తో గురిపెట్టి కాల్పులు జరపడం భారత్‌ ముందున్న మరో ఆప్షన్‌. వీటితోపాటు భారీ మోర్టార్లను కూడా ఉపయోగించవచ్చు. వీటితో ఉద్రిక్తతలకు అవకాశం తక్కువగా ఉంటుంది. నియంత్రణ రేఖ సమీపంలో ఉన్న శత్రుస్థావరాలు, సరఫరాల మార్గాలు, ఔట్‌పోస్టులను ధ్వంసం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి దాడులతో భారత్‌కు పెద్దగా ఫలితం ఉండదు. భారీ దాడులు చేస్తేనే భారీ ఫలితం దక్కుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోదీ సర్కార్ ఏం నిర్ణయం తీసుకోనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa