ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవన్నీ కచ్చితంగా తీసుకోవాలంటూ..సైనిక దుస్తులు అమ్మే దుకాణాలకు సర్కారు కీలక ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 08:44 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముష్కరులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులపై కాల్పులు జరిపారు. మొత్తంగా 28 మంది పురుషులను చంపేశారు. మరెంతో మంది ఈ ఘటనలో గాయపడగా.. ఉత్తరాఖండ్ సర్కారు అప్రమత్తమైంది. ముఖ్యంగా ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో రావడంతో.. ఆర్మీ, పారామిలిటరీ బట్టల అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఈమేరకే ఆయా దుకాణాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ముఖ్యంగా ఉగ్రమూకలు సైనిక దుస్తుల్లో రావడంతో.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రత బలగాలకు సంబంధించిన వస్తువులతో పాటు దుస్తులు అమ్మే దుకాణాల జాబితాను సిద్ధం చేయాలని ఆయా స్టేషన్ ఇన్‌ఛార్జులందరికీ డెహ్రాడూన్ ఎస్ఎస్‌పీ అజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. పల్టాన్ బజార్ వంటి కీలక ప్రాంతాల్లో ప్రధానంగా ఆర్మీ, పారా మిలటరీ యూనిఫాం అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అక్కడున్న ఆయా దుకాణాదారులు అందరికీ పలు సూచనలు చేశారు. వినియోగదారుల్లో ఎవరైనా కొంచెం తేడాగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వెల్లడించారు.


ముఖ్యంగా ఎవరైనా సైనిక దుస్తులు కొనుగోలు చేసేందుకు వస్తే ముందుగా వారి గుర్తింపు కార్డులను చూడాలని చెప్పారు. సరైన ధ్రువీకరణ లేకుండా యూనిఫాంలు, ఇతర వస్తువులు విక్రయించొద్దని వెల్లడించారు. ఆర్మీ దుస్తులు, వస్తువులు అమ్మే ముందు.. వినియోగదారుల నుంచి ఆధార్, ఐడీ కార్డ్, ఫోన్ నంబర్, అడ్రెస్ కార్డులను తీసుకుని పరిశీలించాలని.. ఆపై అవన్నింటినీ నోట్ చేసుకోవాలని సూచించారు. యూనిఫాంల దుర్వినియోగం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పుకొచ్చారు.


దేశవ్యాప్తంగా మొత్తంగా 125 మంది ఉగ్రవాదులు ఉన్నారని భద్రత బలగాలు మరోసారి గుర్తు చేశాయి. వాళ్లలో ఎవరైనా వచ్చి సైనిక దుస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉందని.. కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 125 మంది ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ.. జమ్ము కశ్మీర్‌లోనే మొత్తంగా 115 మంది పాకిస్థానీ టెర్రరిస్టులు ఉన్నట్లు భద్రతా సంస్థలు వెల్లడిస్తున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com